AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buddha Statue: హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వెనుక విషాద గాథ.. ఊహించని ప్రాణ నష్టం ..

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఏర్పాటు వెనుక ఒక విషాద గాథ ఉంది. ఎన్టీఆర్ కలగా ప్రారంభమైన ఈ 17 మీటర్ల విగ్రహం, ప్రతిష్ఠాపన సమయంలో ప్రమాదానికి గురై నీటిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, విగ్రహం రెండేళ్లకు పైగా సాగర్ గర్భంలోనే ఉండిపోయింది.

Buddha Statue: హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వెనుక విషాద గాథ.. ఊహించని ప్రాణ నష్టం ..
Hussain Sagar Buddha Statue
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2026 | 9:27 AM

Share

హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిలిచిన హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వెనుక ఎంతో మందికి తెలియని ఒక విషాద గాథ ఉంది. ఈ భారీ ఏకశిల విగ్రహం ఒకప్పుడు హుస్సేన్ సాగర్ అడుగున దాదాపు రెండేళ్లపాటు ఉండిపోయిందని తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. దీని ఏర్పాటు ప్రక్రియలో జరిగిన ఒక దుర్ఘటనలో ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ విగ్రహం 17 మీటర్ల ఎత్తు, దాదాపు 400 టన్నుల బరువుతో కూడిన అద్భుతమైన ఏకశిల. దీనికి మూలం 1984లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అమెరికా పర్యటన. అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసి ప్రేరణ పొందిన ఎన్టీఆర్, హైదరాబాద్‌లో ఇలాంటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కల సాకారం కోసం ప్రముఖ స్థపతి గణపతిని నియమించారు. ఎన్టీఆర్ సూచనల మేరకు, ఈ విగ్రహాన్ని గ్రానైట్ ఏకశిలతోనే రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకోసం భువనగిరి సమీపంలో ఒక గ్రానైట్ కొండను గుర్తించారు. విగ్రహం తయారీకి ఐదు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయింది. రెండు సంవత్సరాల పాటు శ్రమించి ఈ భారీ ఏకశిల విగ్రహాన్ని చెక్కారు. అయితే, 1989 డిసెంబరులో ఎన్టీఆర్ ప్రభుత్వం దిగిపోవడంతో విగ్రహ ప్రతిష్ఠాపన ఆలస్యమైంది. ఆ తరువాతి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ తలపెట్టిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెన్నారెడ్డి నిర్ణయించడంతో పనులు మళ్లీ వేగవంతమయ్యాయి. ఏబీసీ ఇండియా అనే కంపెనీకి 1990 మార్చి 10న విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌కు తరలించే కాంట్రాక్టును అప్పగించారు.

హైదరాబాద్‌లో అప్పట్లో రోడ్లు ఇరుకుగా ఉండటంతో, విగ్రహాన్ని తరలించడం ఒక పెద్ద సవాలుగా మారింది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రోడ్లు వేయించి, కొన్నింటిని వెడల్పు చేయించింది.  ముందుగా భారీ ట్రక్కులో విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అప్పటికే సిద్ధం చేసిన భారీ పడవలోకి విగ్రహాన్ని జాగ్రత్తగా మార్చారు. పడవ సుమారు 100 మీటర్లకు పైగా దూరం ప్రయాణించాక, అనుకోకుండా ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఈ కుదుపుల కారణంగా 320 టన్నుల బుద్ధ విగ్రహం నీటిలోకి మెల్లగా జారిపోవడం ప్రారంభించింది. విగ్రహాన్ని తరలించేందుకు ఏబీసీ కంపెనీ ఏర్పాటు చేసిన కార్మికులు కొందరు దాని కిందే ఉండిపోయారు. ద వాషింగ్టన్ పోస్ట్ పత్రిక అప్పట్లో రాసిన కథనం ప్రకారం, మొత్తం ఎనిమిది మంది కార్మికులు విగ్రహం కింద చిక్కుకుని మృతి చెందారు. అయితే మరికొన్ని ఆధారాల్లో ప్రమాదంలో 8 నుంచి 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంటున్నాయి. దాదాపు ఐదు గంటల అనంతరం, విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. భారీ విగ్రహాల తరలింపులో ఎలాంటి అనుభవం లేని కంపెనీకి ఈ బాధ్యతను ఎలా అప్పగించారని అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనేక భాగాలను కలిపి రూపొందించారని, కానీ ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్ విగ్రహం భారీగా, ఏకశిలగా ఉండాలని కోరుకున్నారని ద వాషింగ్టన్ పోస్ట్ గుర్తు చేసింది. ఈ విషాద ఘటన తరువాత, బుద్ధ విగ్రహం దాదాపు రెండేళ్లపాటు హుస్సేన్ సాగర్ గర్భంలోనే ఉండిపోయింది. మర్రి చెన్నారెడ్డి ఏడాదిపాటు సీఎంగా కొనసాగిన తర్వాత, 1990 డిసెంబరులో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలోనూ విగ్రహాన్ని బయటకు తీయించలేకపోయారు. చివరగా, 1992 అక్టోబరులో కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే విగ్రహాన్ని బయటకు తీసే పనులు మొదలయ్యాయి. అదే సంవత్సరం, ప్రత్యేక క్రేన్‌ల సహాయంతో హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయిన బుద్ధ విగ్రహాన్ని విజయవంతంగా బయటకు తీశారు. 1992 డిసెంబర్ 1న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తరువాత 1994లో ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ పనులను చేపట్టారు.

Follow Us