
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అరుదైన అవకాశం లభించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక ‘ఫుల్బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్మెంట్’ (Fulbright TEA) ప్రోగ్రామ్ కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన వారు అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఆరు వారాల పాటు ప్రత్యేక అకడమిక్ శిక్షణ పొందుతారు. ఈ ఫెలోషిప్కు అయ్యే ఖర్చు మొత్తాన్ని అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. వీసా, రాను-పోను విమాన టికెట్లు, వసతి, భోజనం, హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు రోజువారీ అలవెన్స్ను కూడా అందిస్తారు. విశేషమేమిటంటే, ఈ శిక్షణ కాలాన్ని ప్రభుత్వం ఆన్ డ్యూటీ గా పరిగణిస్తుంది. ఈ అవకాశం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధించే టీచర్లకే అర్హత ఉంటుంది. కనీసం 5 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలి. ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, గణితం, సైన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులు బోధించే వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంగ్లీష్పై పట్టు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా టోఫెల్ పరీక్షలో కనీసం 45 శాతం మార్కులు సాధించాలి.
ఈ ఫెలోషిప్ను United States-India Educational Foundation నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్సైట్ www.usief.org.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు మార్చి 6 చివరి తేదీగా అధికారులు స్పష్టం చేశారు. ఎంపికైన వారు వచ్చే ఏడాది జనవరి లేదా సెప్టెంబర్లో రెండు విడతలుగా అమెరికా వెళ్తారు. బోధనా విధానాలు, సబ్జెక్ట్ నాలెడ్జ్, సాంస్కృతిక మార్పిడి అంశాల్లో ఈ ప్రోగ్రామ్ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.