Coronavirus Genetic: హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. హుస్సేన్ సాగర్‌తో సహా పలు చెరువుల్లో కరోనా జన్యు అనవాళ్లు..!

కరోనా కల్లోలంతో అల్లాడుతున్న హైదరాబాదీలకు మరో షాకిచ్చే న్యూస్. రోజురోజుకీ కొత్త రూపం దాల్చుతూ పీల్చికు తింటున్న కరోనా మహమ్మారి కొత్త అవతారం ఎత్తినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు.

Coronavirus Genetic: హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. హుస్సేన్ సాగర్‌తో సహా పలు చెరువుల్లో కరోనా జన్యు అనవాళ్లు..!
Coronavirus Genetic Material Found In Hyderabad Hussain Sagar And Two Other Lakes
Follow us

|

Updated on: May 15, 2021 | 4:42 PM

Coronavirus Genetic Material: కరోనా కల్లోలంతో అల్లాడుతున్న హైదరాబాదీలకు మరో షాకిచ్చే న్యూస్. రోజురోజుకీ కొత్త రూపం దాల్చుతూ పీల్చికు తింటున్న కరోనా మహమ్మారి కొత్త అవతారం ఎత్తినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. మనుషులు తాకితేనే వస్తుందనుకున్న వైరస్.. గాలి, నీటిలోనూ ఆనవాళ్లు గుర్తించినట్లు చెబుతున్నారు. తాజాగా భాగ్యనగరంలోని పలు చెరువుల్లో కరోనా జన్యు పదార్థాలు కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హుస్సేన్ సాగర్‌తో పాటు నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కూడా వైరస్ పదార్థాలు కనిపించాయని పేర్కోన్నారు. దేశంలో కరోనా రెండవ వేవ్ ప్రారంభమైన ఈ ఏడాది ఫిబ్రవరిలో నీటిలో ఈ జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభమైనట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అండ్ అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. మొదటి విడత నుంచి సెకండ్ వేవ్ సమయంలో ఏడు నెలల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన శుభ్రపరచని, మురికి నీటి కారణంగా కరోనా వైరస్ జన్యు పదార్థం సరస్సులు, చెరువులలో వ్యాపించినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మహానగరం పరిధిలోని చెరువుల్లోనూ పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ జన్యు పదార్ధం నుండి వైరస్ మరింత విస్తరించదని, అదొక్కటే కాస్త ఊరటనిచ్చే అంశమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇలాంటి అధ్యయనం ఇతర దేశాల్లో నిర్వహించగా నీటిలోని పదార్థం నుంచి వైరస్ వ్యాప్తికి ఎలాంటి ఆధారాలు లేవని తేలినట్లు సీసీఎంబీ డైరెక్టర్ తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి అధ్యయనాలు జరిగాయని, అయితే, నీటిలో ఇప్పటివరకు లభించిన జన్యు పదార్ధం అసలు వైరస్ కాదని తేలిందన్నారు. ఇలాంటి పరిస్థితిలో ముఖం, నోటి ద్వారా నీటి నుంచి వైరస్ వ్యాప్తి చెందడానికి తక్కువ అవకాశం ఉందని తెలిపారు. అయినప్పటికీ మానవ కార్యకలాపాలు, మురికి నీరు కారణంగా నీటిలో లభించే జన్యు పదార్ధాల పెరుగుదల లేదా తగ్గుదలని పర్యవేక్షించడం ద్వారా రాబోయే వేవ్‌ల గురించి అంచనా వేయొచ్చన్నారు.

మరోవైపు, ఇటీవల గంగా, యమునా నదుల్లో కోవిడ్‌ రోగుల మృతదేహాలు కొట్టుకువస్తుండటంతో నదీ తీర గ్రామాలు, నదుల్లోని నీటిని తాగునీటికి వినియోగించే ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మృతదేహాల్లో ఉన్న వైరస్‌ నీళ్ల ద్వారా తమకు కూడా సోకుతుందేమోనని భయపడుతున్నారు. అయితే, నీళ్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందేందుకు అవకాశమే లేదని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. రోగి తుంపరల్లో వైరస్‌ జీవించి ఉన్నప్పుడు నీళ్ల ద్వారా ఎందుకు వ్యాపించదు అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నదులు, చెరువులు, సరస్సులు, స్మిమ్మింగ్‌పూల్స్‌ ద్వారా వైరస్‌ సోకినట్టు ఇప్పటికైతే ఆధారాలు లేవు.

Read Also… కరోనా భయమే మనిషి ప్రాణాలు తీస్తుంది..! అనుమానంతో పెరుగుతున్న ఆత్మహత్యలు