
హైదరాబాద్ మహానగరంలో భూకబ్జాదారుల ఆటకట్టిస్తూ చెరువులను పునరుద్దరిస్తోన్న హైడ్రా.. పాతబస్తీలోని చారిత్రక బుమ్ రుక్ ఉద్ దౌలా చెరువుతోపాటు కూకట్ పల్లిలోని నల్లచెరువును ప్రారంభానికి సర్వం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుమ్ రుక్ ఉద్ దౌలా చెరువును, 9న కూకట్ పల్లి నల్లచెరువును ప్రారంభించనున్నారు.. మొదటి విడతలో 6 చెరువులను రక్షించిన హైడ్రా..గతేడాది సెప్టెంబర్ 28న అంబర్ పేటలోని బతుకమ్మకుంటకు జీవం పోసింది.. ప్రభుత్వ ప్రోత్సాహం, స్థానికుల నుంచి వస్తున్న సహకారంతో భూ అక్రమార్కుల చెరలో బందీ అయిన మరో 14 చెరువులను రెండో విడతలో పునరుద్దరించేందుకు హైడ్రా కసరత్తు చేస్తోంది..
కాంక్రీట్ జంగిల్గా మారిన హైదరాబాద్లో ప్రజలకు కాసింత ఆహ్లాదర వాతావరణాన్ని అందించేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కుల కబ్జాలకు హెడ్రాతో చెక్ పెట్టిస్తూ.. వాటిని ప్రజలకు అందుబాటులో తెస్తోంది. ప్రత్యేకించి చెరువులు, పార్కులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే.. గతేడాది సెప్టెంబర్లో అంబర్పేటలోని బతుకమ్మకుంటకు జీవం పోసి.. సుందరీకరణ చేసింది. దీని తర్వాత వరుసగా పలు చెరువులను కబ్జాల చెర నుంచి విడిపించి.. బ్యూటిఫికేషన్ పనులు చేపట్టింది. ఇప్పుడవన్నీ సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ప్రధానంగా.. పాతబస్తీకి మణిహారంగా నిలిచే చారిత్రక బమ్ రుఖ్ నుద్దౌలా చెరువుకు ప్రాణం పోసింది. పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయిన ఈ చెరువును తవ్వి తీసి చారిత్రక వైభవాన్ని చాటింది. కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న బమ్ రుఖ్ నుద్దౌలా చెరువును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ ప్రారంభించబోతున్నారు.
ఇవాళ ప్రజలకు అందుబాటులోకి రాబోతున్న బమ్ రుఖ్ నుద్దౌలా చెరువు ప్రత్యేకతలను ఒక్కసారి చూద్దాం.. హైదరాబాద్ 3వ నిజాం సికిందర్ ఝా కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ రుఖ్ నుద్దౌలా ఈ సరస్సును అభివృద్ధి చేశారు. మీరాలం చెరువునకు ఎగువన సుమారు 104 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చెరువు.. కాలక్రమేనా పూర్తిగా ఆక్రమణకు గురైంది. చెరువు కరకట్ట మునిగేలా భవన నిర్మాణ వ్యర్థాలతో నింపి ఆనవాళ్లే లేకుండా చేశారు. అయితే.. హైడ్రా రంగంలోకి దిగి.. చెరువు విస్తీర్ణం కేవలం నాలుగున్నర ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు గుర్తించి.. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. కబ్జాలను తొలగించి సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి పనులకు హైడ్రా శ్రీకారం చుట్టింది. 19 కోట్ల రూపాయల వ్యయంతో చెరువును సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దింది. చెరువుకు మూడు వైపులా ఎంట్రాన్స్లతో పాటు.. వాకింగ్ ట్రాక్, జిమ్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, ప్రశాంతంగా సేదతీరేందుకు బల్లలు ఏర్పాటు చేసింది. ఇక.. పాతబస్తీలోని బమ్ రుఖ్ నుద్దౌలా చెరువు అభివృద్ధిని చాలెంజ్గా తీసుకుని సుందరీకరించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
హైడ్రా అభివృద్ధి చేసిన మరో చెరువు కూకట్పల్లిలోని నల్లచెరువు.. దీన్ని కూడా సీఎం రేవంత్రెడ్డి రేపు ప్రారంభించబోతున్నారు. సుమారు 30 ఎకరాల్లోని నల్లచెరువు సైతం కబ్జా కోరల్లో చిక్కుకుపోయింది. దీంతో.. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి హైడ్రా ఎటాక్ చేసి నల్లచెరువు విస్తీర్ణం లెక్కలు తీసింది. డ్రోన్ సర్వే, శాటిలైట్ మ్యాప్స్, సర్వే నివేదికల ఆధారంగా అక్రమ నిర్మాణాల గుట్టురట్టు చేసింది. ఆక్రమణలు తొలగించి.. నల్లచెరువులో అన్యాక్రాంతమైన సుమారు 16 ఎకరాలు భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని అభివృద్ధి పనులు చేపట్టింది. అతికొద్దికాలంలోనే అందరూ ఆశ్చర్యపోయేలా సుమారు 20 కోట్ల రూపాయలతో హైడ్రా తీర్చిదిద్దింది. ఆహ్లాదంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను వరద ముంచెత్తకుండా నీరంతా చెరువులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. గతంలోని ఔట్ లెట్లను ఆధునీకరించి.. మురికి నీళ్లు చెరువులో కలవకుండా చర్యలు తీసుకుంది. సందర్శకులకు అవసరమైన వివిధ రకాల ఏర్పాట్లు చేసింది.
కంటితుడుపు చర్యలు కాకుండా.. శాశ్వతంగా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని ఇచ్చేలా హైదరాబాద్ సిటీలోని చెరువులను డెవలెప్మెంట్ చేస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేప్తోంది. మొత్తంగా.. హైదరాబాద్లో హైడ్రా ఫస్ట్ ఫేజ్లో అభివృద్ధి చేసిన మరో రెండు చెరువులు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. మరో నాలుగు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.