Revanth Reddy: బీఆర్ఎస్ పాలనతో పోల్చకండి.. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ వేసిన పునాదులతోనే.. హైదరాబాద్కు అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణాలో మీట్ ది ప్రెస్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు వైఎస్ఆర్ ఉచిత కరెంట్ ఇస్తే.. మన్మోహన్ 70వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారంటూ వివరించారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారపర్వం ఆఖరి అంకానికి చేరింది.. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వేసిన పునాదులతోనే.. హైదరాబాద్కు అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణాలో మీట్ ది ప్రెస్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు వైఎస్ఆర్ ఉచిత కరెంట్ ఇస్తే.. మన్మోహన్ 70వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారంటూ వివరించారు. తాము చేసిన పనులు కేసీఆర్ చెరిపేస్తే పోయేవి కావని.. రెండేళ్ల తమ పాలనను పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చకండంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
జలయజ్ఞంతో తెలంగాణలో అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టిందని సీఎం రేవంత్ చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి అంతా.. కాంగ్రెస్ పాలనలో జరిగిందన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్కు పెద్దగా ఒరిగింది ఏమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ వేసిన పునాదులతోనే.. హైదరాబాద్కు అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయన్నారు సీఎం. మిగులు రాష్ట్రంగా కాంగ్రెస్ తెలంగాణను ఇస్తే.. 8లక్షల కోట్ల అప్పులు చేసి తనకు రాష్ట్రాన్ని కేసీఆర్ ఇచ్చి వెళ్లారని సీఎం విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ ధీమా వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్లో 100శాతం కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. బీజేపీకి డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఎన్ని గూడుపుఠాణీలు చేసినా ఫలితం ఇదేనంటూ సీఎం జోస్యం చెప్పారు.
తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యంపై వచ్చిన ఆదాయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టిందా అని తెలంగాణ సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్.. ప్రజలే గమనించాలన్నారు. సినీ కార్మికులతో ఎవరు మాట్లాడుతున్నారో .. సినీ తారలతో గెస్ట్ హౌసుల్లో చర్చలు చేస్తున్నారో చూడండి.. సెంటిమెంట్ కావాలో డెవలప్మెంట్ కావాలో తేల్చుకోండి.. అంటూ సూచించారు.
దేశంలో అతిపెద్ద విచారణ సంస్థ సీబీఐ.. అందుకే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తనను బెదిరించడానికి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్ చేశారు.. ఆరు నెలలు బంద్ చేశారనుకో పిల్లల అకడమిక్ ఇయర్ ఏం కావాలి.. విద్య వ్యాపారం కాదు సేవ.. అని.. పంతాలు, పట్టింపులకు పోతే పరిష్కారం కాదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
