
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్నిగంటల పాటు కవిత నివాసంలో సోదాలు చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితను అరెస్ట్ చేయడానికి ముందు కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి వెళ్లారు. కవితను ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ అధికారులను ప్రశ్నించారు.
మధ్యాహ్నం నుంచి కవిత నివాసం దగ్గర హైడ్రామా నడిచింది. ఆమె ఇంట్లో సోదాల కోసం 10 మంది ఈడీ, ఐటీ అధికారుల కవిత ఇంటికి చేరుకున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమా భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్న ఈడీ.. సోదాలు చేయడం సరికాదన్నారు. కోర్టులో కేసు ఉండగా సడెన్గా ఎందుకీ సోదాలని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు MLC కవిత. ఈ పిటిషన్ను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కవిత కోరారు.