
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కూల్గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా.. చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఎగువన ఉన్న రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పరివాహకమంతా గలగల సవ్వడులు చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ, ఏపీలో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఈదురు గాలులు కూడా వీస్తాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్డి ప్రఖర్జైన్ తెలిపారు. సోమవారం మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఉరుములు పిడుగులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కాగా.. గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. వరద ఉధృతి తగ్గడంతో ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లంక గ్రామాల ప్రజలు వరద పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..