జాతీయ రహదారులపై మళ్లీ మొదలైన టోల్ బాదుడు.. అప్పటి నుంచే అమలు..

| Edited By: Srikar T

May 22, 2024 | 3:10 PM

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్ చార్జీలు పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరిగే టోల్ చార్జీలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. పెరిగిన టోల్ చార్జీలు జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని బిఓటి పద్ధతిలో విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు జిఎంఆర్ సంస్థ సిద్దమైంది.

జాతీయ రహదారులపై మళ్లీ మొదలైన టోల్ బాదుడు.. అప్పటి నుంచే అమలు..
Toll Gate
Follow us on

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్ చార్జీలు పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరిగే టోల్ చార్జీలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. పెరిగిన టోల్ చార్జీలు జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని బిఓటి పద్ధతిలో విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు జిఎంఆర్ సంస్థ సిద్దమైంది. జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద ఒకొక్కటి చొప్పున మూడు టోల్‌ప్లాజాలను జీఎమ్మార్‌ సంస్థ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2012 నుంచి టోల్‌ఫీజు వసూళ్లను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది.

నేషనల్ హైవే అథారిటీ నిబంధనల మేరకు ప్రతిఏటా ఏప్రిల్ ఒకటో తేదీన టోల్‌ఫీజు ధరలను పెంచుకునే వెసులుబాటు జీఎమ్మార్‌ సంస్థకు ఎన్‌హెచ్‌ఏఐ కల్పించింది. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టోల్ చార్జీల పెంపును ఎన్నికల సంఘం వాయిదా వేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఆ రోజు అర్ధరాత్రి నుంచి పెరిగిన టోల్ ధరలు అమల్లోకి వస్తాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న హైదరాబాద్‌-విజయవాడ (65), హైదరాబాద్‌-వరంగల్‌ (163) జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. విజయవాడ -జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌, ఏపీలోని చిల్లకల్లు(నందిగామ), వరంగల్‌ హైవేపై బీబీనగర్‌ మండలం గూడురు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. రోజుకు పంతంగి టోల్‌ప్లాజా మీదుగా సుమారు 30 వేలకు పైగా, గూడురు టోల్‌ప్లాజా వద్ద 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుంటాయి. తాజాగా యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద పెరిగిన టోల్ చార్జీలు ఇలా ఉన్నాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు రెండు వైపు ప్రయాణానికి రూ.5, చిన్న లారీ 10 టైర్స్ పై10 రూపాయలు పెరిగాయి. వాణిజ్య, భారీ గూడ్స్ లారీలకు రూ.15 రూపాయలు పెరిగింది. మొత్తం ఐదు శాతం మేర టోల్ చార్జీలు పెంచినట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…