
హైదరాబాద్ మహానగరంలోని మల్కాజిగిరి ప్రాంతంలో కుటుంబ కలహాలు దారుణ హత్యకు దారితీశాయి. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమెను తుపాకీతో కాల్చిచంపిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. హత్య అనంతరం పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతీనగర్కు చెందిన అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మొదటి భార్య అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆమె సోదరి నిషారాణితో అరుణ్కు సన్నిహిత పరిచయం ఏర్పడింది. అనంతరం కుటుంబంలో విభేదాలు తలెత్తడంతో కొంతకాలానికి నిషారాణిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఆ తర్వాత అనుమానాలు, గొడవలు మొదలయ్యాయి.
నిషారాణి తన బంధువులతో మాట్లాడుతున్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్న అరుణ్, తరచూ ఆమెతో వాగ్వాదాలకు దిగేవాడని పోలీసులు చెబుతున్నారు. వేధింపులు ఎక్కువ కావడంతో నిషారాణి కొంతకాలం పుట్టింట్లోనే నివసించింది. అయితే ఆమెను హత్య చేయాలనే ఉద్దేశంతో అరుణ్ ముందుగానే ప్రణాళిక రచించినట్లు విచారణలో వెల్లడైంది. తన పరిచయాల ద్వారా అక్రమంగా తుపాకీ తెప్పించుకుని, దానిని ఉపయోగించడంపై సాధన కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
గతంలో ఆయుధం కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన అరుణ్, బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ తుపాకీ సమకూర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బంధువుల మధ్యవర్తిత్వంతో నిషారాణి తిరిగి ఇంటికి వచ్చినప్పటికీ, పరిస్థితుల్లో మార్పు రాలేదు. బుధవారం (జూన్ 10) తెల్లవారుజామున భార్యాభర్తల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. ఆగ్రహంతో అరుణ్ తుపాకీ తీసుకుని నిషారాణిపై వరుసగా కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాల్పుల శబ్దం విని కుటుంబ సభ్యులు బయటకు రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అరుణ్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన తుపాకీ ఎలా సమకూరిందనే కోణంలోనూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మల్కాజిగిరిలో తీవ్ర కలకలం రేపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…