
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఒక శుభవార్త. మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, ప్రయాణాన్ని మరింత సులభతరం మరియు సౌకర్యవంతం చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. మెట్రో సేవలను మెరుగుపరచడం, రద్దీని సమర్థవంతంగా నియంత్రించడమే లక్ష్యంగా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా బుధవారం (జూలై 15) హెచ్ఎంఆర్ఎల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతాధికారుల కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్తో పాటు వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. మొదటి దశలోని 69 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మెట్రో కారిడార్లలో ప్రయాణికుల భద్రత, సదుపాయాల కల్పనపై ప్రధానంగా చర్చించారు.
ఈ సమీక్షలో తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం – మెట్రో రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేయడం. పీక్ అవర్స్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు వీలైనంత త్వరగా అదనపు కోచ్లను సమకూర్చుకోవాలని నిర్ణయించారు. దీని కోసం సంబంధిత తయారీదారులతో చర్చలు జరిపి, త్వరితగతిన బోగీలను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
స్టేషన్ల నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరడానికి వీలుగా ‘లాస్ట్-మైల్ కనెక్టివిటీ’ని బలోపేతం చేయనున్నారు. ఇందుకోసం ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఫీడర్ సర్వీసులు, వాహన సదుపాయాలను విస్తరిస్తారు. అలాగే, ప్రధాన రైల్వే స్టేషన్లను, మెట్రో స్టేషన్లను అనుసంధానించే స్కైవాక్ల (Skywalks) నిర్వహణ, పొడిగింపుపై రైల్వే అధికారులతో కలిసి పనిచేయనున్నారు.
టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని, గందరగోళాన్ని నివారించడానికి ప్రతి మెట్రో స్టేషన్కు ఒక ప్రత్యేక స్థానిక ప్రణాళికను రూపొందిస్తున్నారు. దీనిని మొదటగా ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లలో అమలు చేసి, ఆపై అన్ని స్టేషన్లకు విస్తరిస్తారు. ఐటీ కారిడార్ పరిధిలోని హైటెక్ సిటీ, రాయదుర్గ్, గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాలలో పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) రవాణా వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదనల పురోగతిని కూడా సమీక్షించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించేందుకు త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టనున్నట్లు అదనపు ఎండీ అజిత్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..