ORRపై ఘోర ప్రమాదం.. కంటైనర్ను ఢీకొన్న కారు.. నటుడు భరత్ కాంత్తో పాటు మరొకరు మృతి!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై పెను విషాదం చోటుచేసుకుంది. ఆదివారం (మే 10) అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ ప్రమాదంలో సినీ నటుడు కత్తి భరత్ కాంత్ (31) తోపాటు అతని స్నేహితుడు గూడ సాయి త్రిలోక్ (31) అక్కడికక్కడే మృతి చెందారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై పెను విషాదం చోటుచేసుకుంది. ఆదివారం (మే 10) అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ ప్రమాదంలో సినీ నటుడు కత్తి భరత్ కాంత్ (31) తోపాటు అతని స్నేహితుడు గూడ సాయి త్రిలోక్ (31) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. భరత్ కాంత్, సాయి త్రిలోక్ తమ కారులో నెల్లూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో, వీరి కారు ముందు వెళ్తున్న ఒక కంటైనర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. కారు అతివేగంగా ఉండటంతో, కంటైనర్ కిందకు దూసుకువెళ్లి నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద ధాటికి కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. ప్రమాద సమయంలో కారును ఎవరు నడుపుతున్నారు? ప్రమాదం నిద్రమత్తు వల్ల జరిగిందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నటుడు భరత్ కాంత్ మరణవార్త తెలియడంతో అటె నెల్లూరులో.. ఇటు సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రయాణాల్లో అజాగ్రత్త, అతివేగం ఎంతటి ప్రాణనష్టానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
