BJP: ఆ ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్న నలుగురు.. బీజేపీలో ఎందుకింత డిమాండ్..
అదిలాబాద్ ఎంపీ టికెట్కు బీజేపీలో ఫుల్ డిమాండ్ ఉంది. నలుగురు ఎమ్మెల్యేలు గెలవడం, సిట్టింగ్ ఎంపీ కావడంతో.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన రమేష్బాబు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. ఎంపీ సోయం బాపూరావు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రమేష్బాబుపై పరోక్ష విమర్శలు చేశారు.

ఆదిలాబాద్, జనవరి 24: అదిలాబాద్ ఎంపీ టికెట్కు బీజేపీలో ఫుల్ డిమాండ్ ఉంది. నలుగురు ఎమ్మెల్యేలు గెలవడం, సిట్టింగ్ ఎంపీ కావడంతో.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన రమేష్బాబు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. ఎంపీ సోయం బాపూరావు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రమేష్బాబుపై పరోక్ష విమర్శలు చేశారు. ఆదిలాబాద్ ఎంపీకి ఈసారి బీజేపీలో తీవ్ర పోటీ ఉంది. టికెట్ మళ్లీ తనకే వస్తుందనే సోయం బాపురావు ధీమాగా ఉండగా.. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్తో పాటు భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేశ్ బాబు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన రమేశ్బాబు.. ఎమ్మెల్యే రామరావు పటేల్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మద్దతుతో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఫ్లెక్సీలు, హోర్డింగులు కూడా ఏర్పాటు చేశారు రమేష్ బాబు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎంపీ సోయం బాపూరావు.. రమేష్ బాబుపై ఇండైరెక్ట్గా విమర్శలు గుప్పించారు. గల్లీకో ఫ్లెక్సీ పెడితే టికెట్ రాదు.. క్యాడర్ లేనోడు.. లీడర్ కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ టికెట్ అంగట్లో సరుకు కాదన్నారు. ఎంపీగా తానేం అభివృద్ది చేయలేదంటూ కొందరు సొంత పార్టీ నేతలు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఏం చేసేది.. అధిష్ఠానం అన్నీ గమనిస్తోందని చెప్పారు సోయం బాపూరావు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లతో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. సిట్టింగ్ ఎంపీతోపాటు నాలుగు నియోజకవర్గాల్లో బలం పెరగడం బీజేపీకి కలిసొచ్చే అంశం కావడంతో.. ఎంపీ సీటు కోసం ఆశావహుల్లో పోటీ పెరిగింది.
