Bankers Meeting: ఆయిల్‌ పామ్‌ సాగుకు బ్యాంకులు రుణాలు అందించి ప్రోత్సాహించాలి.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి

దేశంలో అగ్రగామిగా వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగంలో బలపడింది..

Bankers Meeting: ఆయిల్‌ పామ్‌ సాగుకు బ్యాంకులు రుణాలు అందించి ప్రోత్సాహించాలి.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
Bankers Meeting

Updated on: Mar 21, 2023 | 4:05 PM

దేశంలో అగ్రగామిగా వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగంలో బలపడింది. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల సగటులో మొదటి స్థానానికి చేరుకున్నాం.. అదే సమయంలో రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హోటల్ మ్యారిగోల్డ్‌లోరాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, ఎస్ఎల్ బీసీ అధ్యక్షులు అమిత్ జింగ్రాన్, జీఎం నాబార్డ్ డాక్టర్ వై.హరగోపాల్, ఆర్బీఐ డీజీఎం కేఎస్ చక్రవర్తిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులను మరింతగా పెంచామని, ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకులు రుణాలు అందించి ప్రోత్సాహించాలని బ్యాంకులను కోరారు. బ్యాంకులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించి వాటి స్థాపన మీద దృష్టిపెట్టాలని, వాటి నుంచి ప్రజలకు ఉపాధి కలిగే అవకాశాల మీద బ్యాంకులు అధ్యయనం చేయాలన్నారు.

ప్రతి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ఇది వరకే దృష్టిపెట్టిందని, డైరీ రంగాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అందుకుగాను బ్యాంకులు డైరీ రంగం మీద అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా సహకరించాలని, బ్యాంకులు కేవలం పట్టణాలలోని ఆస్తులు, భూములనే ప్రామాణికంగా తీసుకుంటున్నాయని, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇచ్చే విదేశీ విద్య బ్యాంకు రుణాల గరిష్ట పరిమితి రూ.7.5 లక్షల నుంచి పెంచాలని కోరారు.

గత తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల భూముల ధరలు భారీగా పెరిగాయని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని బ్యాంకర్లకు మంత్రి పలు సూచనలు చేశారు. వేరుశెనగ పంట ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో వినియోగించే పీనట్ బట్టర్ కు డిమాండ్ అధికంగా ఉందన్నారు. కానీ అక్కడ వేరుశెనగ పంట పండదని, నాణ్యమైన వేరుశెనగ ఉత్పత్తులకు తెలంగాణ అనువైన ప్రాంతమన్నారు. అటువంటి పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు ప్రోత్సాహం అందిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడానికి క్షేత్రస్థాయి అవకాశాలను పారిశ్రామికవేత్తలే కాకుండా బ్యాంకులు కూడా పరిశీలించాలని సూచించారు. 2022 – 23 సంవత్సరానికి గాను వ్యవసాయ రంగానికి బ్యాంకులు ఇచ్చే రుణాలు పెట్టుకున్న లక్ష్యంలో 62 శాతమే చేరుకున్నారని, బ్యాంకులు ఈ రుణాల విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us