Telangana: బీసీ మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు

Indiramma Sewing Machines: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ, ఇతర రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. అదే తరహాలో కుట్టు మిషన్ల పథకం ద్వారా మహిళలు ఇంటి వద్దే ఉపాధి పొందేలా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ..

Telangana: బీసీ మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు
Indiramma Sewing Machines

Edited By:

Updated on: Aug 13, 2026 | 5:12 PM

Indiramma Sewing Machines: బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రారంభించారు.

119 నియోజకవర్గాల్లో పంపిణీ

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించనున్నారు. ఒక్కో మిషన్ విలువ రూ.12 వేలు కాగా.. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 100 శాతం సబ్సిడీతో పంపిణీ చేయనున్నారు.

నెల రోజుల పాటు దరఖాస్తులు

ఈ పథకానికి అర్హులైన బీసీ మహిళల నుంచి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ మహిళలకు ఇంటి నుంచే ఆదాయం పొందే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి

పేద మహిళలకు ప్రాధాన్యం

లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులతో పాటు కుట్టు వృత్తిలో ఇప్పటికే అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల ప్రకారం ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడంతో పాటు కుట్టు మిషన్ల వినియోగంపై అవసరమైన శిక్షణ కూడా అందించనున్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

బీసీ మహిళలను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

తొలి దశలో 1.19 లక్షల మందికి అవకాశం

కుట్టు మిషన్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తొలి దశలో 1.19 లక్షల మంది అర్హులకు అవకాశం కల్పించనున్నారు. భవిష్యత్‌లో పథకాన్ని మరింత విస్తరించి ఎక్కువ మంది బీసీ మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాలపైనా దృష్టి

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ, ఇతర రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. అదే తరహాలో కుట్టు మిషన్ల పథకం ద్వారా మహిళలు ఇంటి వద్దే ఉపాధి పొందేలా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులను పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కులగణన అనంతరం బీసీల అభివృద్ధికి సంబంధించిన తదుపరి కార్యాచరణను మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us