
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా నగర పరిధిలోని అన్ని పశు వధశాలలు, రిటైల్ బీఫ్ విక్రయ దుకాణాలను పూర్తిస్థాయిలో మూసివేయాలని ఆదేశించింది. GHMC చట్టం 1955లోని సెక్షన్ 533(బి) నిబంధనల ప్రకారం పండగ రోజున బీఫ్ విక్రయాలు, కసాయిశాలల నిర్వహణపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు యంత్రాంగం స్పష్టం చేసింది.
ఈ బంద్ ఆదేశాలు కఠినంగా అమలు జరిగేలా చూడాలని, మున్సిపల్ సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు GHMC కమిషనర్ లేఖ రాశారు.దీనికి సంబంధించిన నోటీస్ రిలీజ్ చేశారు.
పండగ వేళ ప్రజల ఆధ్యాత్మిక భావోద్వేగాలను గౌరవించడంతో పాటు ఎలాంటి అపశ్రుతులు, వివాదాలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని GHMC హెచ్చరించింది.
పవిత్రమైన కృష్ణాష్టమి వేడుకలు నగరవ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేందుకు వీలుగా ఈ చర్యలు చేపట్టినట్లు యంత్రాంగం పేర్కొంది.