TRS టు BRS.. కేసీఆర్ ఉద్యమ పార్టీకి పాతిక వసంతాలు..

తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన గులాబీ పార్టీ పాతిక వసంతాలు పూర్తి చేసుకుంది. జలదృశ్యంలో 2001లో మొదలైన TRS పార్టీ 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ జనదృశ్యాన్ని సాక్షాత్కారం చేసింది. తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు BRSగా మారి పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకుంది.

TRS టు BRS.. కేసీఆర్ ఉద్యమ పార్టీకి పాతిక వసంతాలు..
BRS Chief KCR

Updated on: Apr 27, 2026 | 9:07 AM

సరిగ్గా పాతికేళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. పదవీ త్యాగపునాది మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతో
2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందని బలంగా నమ్మిన కేసీఆర్.. అదే విజన్‌తో 13 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 2001 మే 17న తెలంగాణ సింహగర్జన భారీ బహిరంగ సభలోనే కేసీఆర్‌ రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణ సాధిస్తామని ప్రకటించారు. ఇక నాటి నుంచి రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలతో 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటులో TRS కీలక పాత్ర పోషించింది.

దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికతో 2022లో పార్టీ పేరును KCR బీఆర్ఎస్‌గా మార్చారు. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. తెలంగాణ రాజకీయం ప్రస్థానంలో పాతిక ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఇవాళ BRS పార్టీ ఆవిర్భావ
దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు బీఆర్ఎస్​ శ్రేణులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి
ప్రతినిధుల సమావేశం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు.

ప్లీనరీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం

ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని, ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరు కావాలని కోరారు. మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us