తుపాకీ వదిలి పుస్తకం పట్టి.. 60 ఏళ్ల వయసులో లాసెట్లో అదరగొట్టిన మావోయిస్ట్ మాజీ చీఫ్..
చదువుకోవడానికి వయసుతో పనేముంది.. సాధించాలనే సంకల్పం ఉండాలే కానీ ఏ వయసులోనైనా చరిత్ర సృష్టించవచ్చు" అని నిరూపించారు మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని సాగిన ఆయన ప్రస్థానం.. ఇప్పుడు న్యాయ విద్యా రంగం వైపు మళ్లింది. ఇటీవల విడుదలైన తెలంగాణ లాసెట్-2026 ఫలితాల్లో దేవ్జీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రవ్యాప్తంగా 349వ ర్యాంకు సాధించారు.

విద్యకు వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించారు మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఐదేళ్ల న్యాయ విద్యా కోర్సులో ప్రవేశం కోసం రాసిన పరీక్షలో 57 మార్కులు సాధించి రాష్ట్రవ్యాప్తంగా 349వ ర్యాంకు దక్కించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేవ్జీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన విద్యాభ్యాసంపై దృష్టి సారించారు. 1980-82 మధ్య కాలంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన దేవ్జీకి అప్పట్లో తెలుగు సబ్జెక్టు మిగిలిపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఆ సబ్జెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని మే 13న ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్ష రాశారు. ప్రస్తుతం ఆ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ ఫలితాలు ఇంకా రాకపోయినా, భవిష్యత్తులో న్యాయ విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో లాసెట్ పరీక్షకు హాజరైన ఆయన మంచి ర్యాంకు సాధించడం విశేషంగా మారింది. 60 ఏళ్లు దాటిన వయసులోనూ చదువుపై చూపిన అంకితభావం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. న్యాయవాదిగా మారిన తర్వాత సమాజంలోని పేదలు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలన్నదే తన లక్ష్యమని దేవ్జీ చెబుతున్నారు.
లాసెట్లో 73 శాతం ఉత్తీర్ణత
ఇదిలా ఉండగా, గురువారం విడుదలైన తెలంగాణ లాసెట్-2026 ఫలితాల్లో మొత్తం 73 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 66,864 మంది దరఖాస్తు చేసుకోగా, 54,374 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 39,673 మంది కనీస అర్హత మార్కులు సాధించి కన్వీనర్ కోటా కింద సీట్ల కోసం అర్హత పొందారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. లా కోర్సుల్లో చేరిన విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 75 శాతం హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇది బార్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారమే అమలులో ఉందన్నారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 60 ఏళ్లు దాటినవారు కూడా గణనీయ సంఖ్యలో ఉండటం విశేషం. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు 348 మంది, ఐదేళ్ల ఎల్ఎల్బీకి 21 మంది, ఎల్ఎల్ఎం కోర్సుకు 82 మంది అర్హత సాధించారు. అలాగే అర్హత పొందిన వారిలో 7,252 మంది బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
