
ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణలో పొలిటికల్ ఫైట్ జోరందుకుంది. రాష్ట్రంలో ఈ ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో జాగ్రత్తగా ఉండాలంటూ శ్రేణులకు పిలుపునిస్తున్న పార్టీలు.. బీజేపీపై విమర్శలు గుప్పించాయి. ఎస్ఐఆర్ను హడావిడిగా చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఎస్ఐఆర్ వల్లే బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారాయని ఆరోపించింది. ఈ ప్రక్రియను ఏడాదిన్నరపాటు జాగ్రత్తగా చేయాలని కోరింది.
ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. బీజేపీకి ఓటేయరని ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు తొలగించే కుట్ర చెయ్యొచ్చని ఆరోపించారు కేటీఆర్. ఇలా ఓట్లు తొలగించడం వల్లే బిహార్, బెంగాల్లో గలాటా జరిగిందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యవస్థల్ని బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలోనూ అలాంటి అవకాశం కోసం బీజేపీ ఎదురుచూస్తోందన్నారు.
అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలను తప్పుబట్టారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టిందేమీ కాదన్నారు. పార్టీలన్నీ ఇందులో భాగస్వామ్యం అవుతాయన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే అనే విషయం కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోతుందన్నారు. అక్రమంగా దేశంలో ఉంటున్న వారి ఓట్లు కచ్చితంగా తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు.
మొత్తానికి ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో పొలిటికల్ దుమారానికి తెరలేపే అవకాశం లేకపోలేదని నేతల మాటలను బట్టి అర్థమవుతోంది. మరోవైపు ఈ ప్రక్రియ కారణంగా సామాన్యుల ఓట్లు.. తమకు అనుకూలంగా ఉండే వారి ఓట్లు పోకుండా చూడాలని శ్రేణులకు పార్టీ నాయకత్వాలు దిశానిర్దేశం చేస్తున్నాయి.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ – SIR) ప్రక్రియను భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తోంది. ఓటరు జాబితాలో అనర్హులను నకిలీ ఓటర్లను తొలగించి, పారదర్శకంగా జాబితాను సిద్ధం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.. ఎస్ఐఆర్ ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు) జూన్ 25 నుండి జూలై 24 వరకు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. ఓటర్ల వెరిఫికేషన్ కోసం ప్రతి ఒక్కరూ రెండు ప్రత్యేక ఫారాలను నింపాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా జూలై 31, 2026న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటరు జాబితాను అధికారులు విడుదల చేస్తారు. జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అన్నీ పరిశీలించిన తర్వాత అక్టోబర్ 1, 2026న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..