Telangana: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. విద్యా కమిషన్‌ చైర్మన్‌గా ఆకునూరి మురళి

|

Sep 07, 2024 | 8:27 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమించింది. దీంతో పాటు బీసీ కమిషన్ చైర్మన్‌, బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులను ఎంపిక చేసింది.

Telangana: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. విద్యా కమిషన్‌ చైర్మన్‌గా ఆకునూరి మురళి
Cm Revanth Reddy Akunuri Murali
Follow us on

తెలంగాణలో విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు తీసుకురావాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమించింది. దీంతో పాటు బీసీ కమిషన్ చైర్మన్‌, బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులను ఎంపిక చేసింది.

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రీప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు కొత్తగా తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమించింది.

ఈ బాధ్యతలను సీఎం రేవంత్ ఎవరికి అప్పగిస్తారనే దానిపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అనుభవం కలిగిన విద్యావేత్తకు కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ అనుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో దీనికి కోదండరాంను చైర్మన్‌గా నియమించవచ్చనే ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఆయన ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. మరోవైపు కాంగ్రెస్ మద్దతుదారుడుగా కొనసాగుతోన్న ఆకునూరి మురళిని విద్యా కమిషన్ చైర్మన్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్టుగానే ఆకునూరి మురళి వైపు రేవంత్ సర్కార్ మొగ్గుచూపింది. ప్రభుత్వ బడులను కార్పోరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్న రేవంత్ సర్కార్.. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డి

విద్యా కమిషన్ చైర్మన్‌తో పాటు మరికొన్ని కమిషన్ల చైర్మన్‌ను కూడా ప్రకటించింది ప్రభుత్వం. వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డిని ఎంపిక చేసింది. బీసీ కమిషన్ చైర్మన్‌గా జి.నిరంజన్‌ను నియమించింది. ఇక బీసీ కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మిలను నియమించారు. నామినేటేడ్ పదవుల భర్తీలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ సర్కార్.. రాబోయే రోజుల్లో ఎవరెవరికి పదవులు కట్టబెడుతుందో అనే ఉత్కంఠ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..