
సాధారణంగా మనం బిజీ లైఫ్లో పడి విద్యుత్ బిల్లు చెల్లించడం మర్చిపోతుంటాం. అప్పుడు వెంటనే విద్యుత్ శాఖ అధికారులు వచ్చి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మీటర్లోని ఫీజు పీకేయడం లేదా కనెక్షన్ కట్ చేయడం మనం రెగ్యులర్గా చూస్తుంటాం. అయితే, ఇలా చేయడం చట్టవిరుద్ధమని మీకు తెలుసా? దీనికి సంబంధించి ‘ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003′(Electricity Act 2003)లో వినియోగదారులకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. వీటి గురించి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ అందించిన వివరణ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లోని సెక్షన్ 56(1) ప్రకారం, ఏ వినియోగదారుడైనా బిల్లు కట్టనప్పుడు నేరుగా కనెక్షన్ కట్ చేసే అధికారం డిపార్ట్మెంట్కు లేదు. కనెక్షన్ కట్ చేయడానికి కనీసం 15 రోజుల ముందు వినియోగదారుడికి రాతపూర్వకమైన నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసులో బిల్లు చెల్లించకపోవడానికి గల కారణం, కనెక్షన్ ఎందుకు కట్ చేస్తున్నారో వివరించాలి. ఈ 15 రోజుల సమయం అనేది వినియోగదారుడు తన వివరణ ఇచ్చుకోవడానికి లేదా బిల్లు చెల్లించడానికి ఇచ్చే అవకాశం.
ముఖ్యంగా ఈ రోజుల్లో ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు టెక్నికల్ సమస్యల వల్ల మనం బిల్లు కట్టినా అది డిపార్ట్మెంట్ సర్వర్లో అప్డేట్ కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అధికారులు వచ్చి కనెక్షన్ కట్ చేస్తే అది తీవ్రమైన ఉల్లంఘన అవుతుంది. దీనిపై ఫిబ్రవరి 2026లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. నోటీసు ఇవ్వకుండా కనెక్షన్ కట్ చేయడం ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని కోర్టు పేర్కొంది. ఒకవేళ మీ అనుమతి లేకుండా, నోటీసు ఇవ్వకుండా ఎవరైనా కనెక్షన్ కట్ చేస్తే, మీరు సదరు అధికారులపై పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయవచ్చు. చట్టం పట్ల అవగాహన ఉంటేనే మన హక్కులను మనం కాపాడుకోగలం.
ఇది చదవండి: ఆడు మగోడు.. ఇలాంటోడు ఒక్కడున్నా చాలు.. మా జట్టుకు పట్టిన దరిద్రం మొత్తం పోతుద్ది..