
ధర్మపురి, జూన్ 1: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి చెందిన జంగం రాజయ్య అనారోగ్యంతో మృతి చెందగా, భర్త మృతిని తట్టుకోలేకపోయిన భార్య జంగం సాయమ్మ కొన్ని గంటల వ్యవధిలోనే కన్నుమూశారు. ఉదయం వరకు ఇంట్లో ఉన్న ఇద్దరూ.. సాయంత్రానికి శవాలుగా మారిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
గ్రామస్థుల కథనం ప్రకారం రాజయ్య–సాయమ్మ దంపతులు ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా జీవించారు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలిచిన ఈ దంపతులను గ్రామంలో ఆదర్శ దంపతులుగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. రాజయ్య మరణ వార్త ఇంట్లో విషాదాన్ని నింపగా, భర్త మృతదేహాన్ని చూసి సాయమ్మ తీవ్ర మనోవేదనకు గురైనట్లు బంధువులు చెబుతున్నారు. కన్నీళ్లు ఆరని ఆ ఇంట్లో కొద్దిసేపటికే మరో విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఒకేరోజు తల్లిదండ్రులను కోల్పోయిన వారి పిల్లలు, మనవళ్లు గుండెలవిసేలా విలపించారు. “ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు” అంటూ గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటిముందు చేరుకున్న గ్రామస్థులు, బంధువులు దంపతుల మృతదేహాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. జీవితమంతా కలిసి నడిచిన ఆ జంట.. చివరి ప్రయాణాన్నీ కలిసి ప్రారంభించడంతో గ్రామమంతా భావోద్వేగానికి లోనైంది. ఈ ఘటనతో దోనూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. “ఇలాంటి సంఘటనలు సినిమాల్లోనే చూస్తాం.. కానీ మన కళ్లముందే జరగడం చాలా బాధాకరం” అంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల మృతితో ఆ కుటుంబంలో తీరని లోటు ఏర్పడగా, గ్రామస్థులంతా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. కలిసి జీవించిన ఆ దంపతులు.. చివరికి ఒకేరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.