
దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే బ్లైజ్ కో–ఫౌండర్, సీఈఓ దినాకర్ మునగాలాతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంస్థ విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ పెట్టుబడులపై విస్తృత చర్చ జరిగింది. చర్చల అనంతరం అధికారికంగా ఎంవోయూ కుదిరింది. బ్లైజ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్లో రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్, ఇంజినీరింగ్ సెంటర్ను నిర్వహిస్తోంది. ఈ కేంద్రాన్ని మరింత విస్తరించేందుకు పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ఈ ఒప్పందంలో స్పష్టత వచ్చింది. ఏఐ హార్డ్వేర్, ఫుల్-స్టాక్ సాఫ్ట్వేర్ అభివృద్ధి రంగంలో హైదరాబాద్ను కీలక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా సంస్థ ముందుకెళ్తోంది.
హెల్త్కేర్ డయాగ్నోస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అంశాలపై కూడా చర్చ జరిగింది. దీంతో పరిశ్రమలలో సాంకేతిక మార్పులకు తెలంగాణ కేంద్రంగా మారనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేయడం రాష్ట్ర దీర్ఘకాలిక లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చే రెండు దశాబ్దాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి సాధనకు ఏఐ, డేటా సెంటర్ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, హార్డ్వేర్, ఆటోమేషన్ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు దూసుకెళ్తోందని సీఎం తెలిపారు. దేశంలోనే టెక్నాలజీ హబ్గా తెలంగాణ ఎదుగుతోందని పేర్కొన్నారు. బ్లైజ్ హైదరాబాద్ ఆర్ అండ్ డీ యూనిట్ విస్తరణకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో త్వరలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది ఏఐ పెట్టుబడులు, పరిశోధనలు, ఆవిష్కరణలకు వ్యూహాత్మక కేంద్రంగా మారుతుందని చెప్పారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి ఏఐ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ ఒప్పందంతో తెలంగాణ టెక్నాలజీ ఎకోసిస్టమ్కు అంతర్జాతీయ గుర్తింపు మరింత బలపడనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.