ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు. అడ్డమైన లింకులు పెట్టి అడ్డంగా దోచుకునే సైబర్ ముఠాలు.. వైఫైలా మన చుట్టూరా ఉన్నాయి. అలాంటి వాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితులకు కొన్ని కీలక సూచనలు చేశారు పోలీసులు. ఇన్స్టా.. స్నాప్చాట్.. ఫేస్బుక్.. వాట్సాప్.. ఇలా అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించి కొంతమంది సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. రోజూ కొన్ని వేల మంది అమాయకులు సైబర్ చీటర్స్ చేతిలో మోసపోయి.. లక్షలాది రూపాయల డబ్బు పోగొట్టుకుంటున్నారు. అలాంటి బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్స్ కేసుల ఎఫ్ఐఆర్ విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గతంలో లక్షా 50వేల కంటే ఎక్కువ మొత్తంలో పోగొట్టుకున్న బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేవారు. అలాగే లక్షా యాభై వేల కంటే తక్కువ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న సందర్భంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేవారు. అయితే 50వేల లోపు పోగొట్టుకున్న బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. ఇన్ స్పెక్టర్ లేదా డిఐ ర్యాంక్ అధికారులు దర్యాప్తు చేస్తారన్నారు. ఇక 50వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నట్టు ఫిర్యాదులు వస్తే.. సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేస్తారన్నారు. సైబర్ క్రైమ్స్ నేరాలకు సంబంధించిన ఇతర ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్ నమోదు చేయాలని ప్రజలకు సూచించారు సీపీ మహంతి. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతోందనీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తు్న్నారు. స్పామ్ లింక్లు, ఫ్రాడ్ అప్లికేషన్లను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..