రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ, ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సురెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని ఈ నెల 25న (రేపు) ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తారు..
హైదరాబాద్, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ, ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సురెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని ఈ నెల 25న (రేపు) ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తారు. ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణను అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మేలు జరిగేలా ఈ కాలేజీలను ఎంపిక చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న బీఎఫ్ఎస్ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతోంది. అత్యంత ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించనుండటం విశేషం.
ఈ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ తీసుకోనున్న 10 వేల మంది విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ రూపొందిస్తోంది. విద్యార్థుల బయోడేటాతో పాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవం వివరాలన్నీ అక్కడ పొందుపరుస్తారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పని చేస్తుంది. బీఎఫ్ఎస్ఐ కంపెనీలు ఈ పోర్టల్లో ఉన్న విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసే వీలుంటుంది. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ భరోసాకు ప్రభుత్వం కొత్త బాటలు వేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సహకారంతో బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం మినీ డిగ్రీ కోర్సుకు అవసరమైన సిలబస్ రూపొందించింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా సీఎస్ఆర్ నిధులను సమీకరించి మూడేండ్ల పాటు ఈ శిక్షణను అందించేలా మంత్రి శ్రీధర్బాబు బీఎఫ్ఎస్ఐ సంస్థల ప్రతినిధులతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. EQUIPPP అనే సంస్థ ఈ ప్రోగ్రాంకు రూ.2.50 కోట్లు అందించేందుకు ముందుకు వచ్చింది. విద్యార్థులకు ఉపాధి కల్పించేలా జీసీసీలకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా ఉండటంతో పాటు సీఎస్ఆర్ నిధులను సమీకరించనుంది.