Telangana Cabinet: ఈ నెల 20న కేబినెట్ భేటీ.. రేషన్ కార్డ్, హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత!

| Edited By: Balaraju Goud

Sep 14, 2024 | 5:35 PM

తెలంగాణ రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈనెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ సమావేశం సెప్టెంబర్ 20న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది.

Telangana Cabinet: ఈ నెల 20న కేబినెట్ భేటీ.. రేషన్ కార్డ్, హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత!
Telangana Cabinet
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈనెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ సమావేశం సెప్టెంబర్ 20న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. కొద్ది రోజులుగా పెండింగ్‌లో ఉన్న పలు కీలక అంశాలపై రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది.

ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించిన విధానాలు ఖరారు చేయాలని కేబినెట్ యోచిస్తోంది. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీలో పారదర్శకతను పెంచడానికి మార్పులు చేర్పులు చేయాలన్న ఆలోచనతో కేబినెట్ నిర్ణయం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులు పొందే అర్హతలపై సవరణలు చేసి, ప్రజలకు మరింత సౌలభ్యంగా అందజేయాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, హెల్త్ కార్డుల విషయంలో కూడా మంత్రి మండలి చర్చించనుంది. సాధారణ ప్రజలకు ఆరోగ్య సేవల విస్తరణను సులభతరం చేయడానికి ఆరోగ్య కార్డుల పంపిణీపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది.

హైడ్రా కోసం ఆర్డినెన్స్ …

ఇక హైడ్రాకు చట్టబద్ధతను తీసుకురావడానికి ఆర్డినెన్స్ ఇచ్చే అంశాలు కేబినెట్ చర్చించనున్నారు. హైడ్రా ఇప్పటి వరకు 99 జీవో ద్వారా మాత్రమే కొనసాగుతుంది. దీనికి చట్టబద్ధత కల్పించడానికి ఆర్డినెన్స్ ఇవ్వాలనే ఆలోచన చేస్తుంది రేవంత్ సర్కార్. దీంతో ఈ కేబినెట్‌లో ఆ అంశం పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇక రైతుల సంక్షేమానికి సంబంధించి రేవంత్ సర్కార్ ప్రత్యేక పోకస్ చేయనుంది. రైతులకు మద్దతుగా చేపట్టిన రైతు భరోసా పథకంపై కేబినెట్‌లో కీలక చర్చ జరగనుంది. దీని అమలుకు సంబంధించి రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. అలాగే, విద్యా రంగంలో సంస్కరణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయదలచిన విద్యా కమిషన్, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రైతు కమిషన్‌లపై కేబినెట్ లో చర్చ జరగనుంది.

వరదలపై కేంద్ర సాయం కోసం తీర్మానం..

ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను దెబ్బతీశాయి. ఆ వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి, సహాయం కోరుతూ తీర్మానం చేసి పంపాలని కేబినెట్ యోచిస్తోంది. ఈ వరదలు పంటలను, దెబ్బతీసి ప్రజలకు తీవ్ర నష్టం కలిగించాయి. దీంతో కేబినెట్ తీర్మానం చేసి పంపాలని యోచిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోబోతోంది రాష్ట్ర కేబినెట్. అయితే మంత్రి మండలి సమావేశానికి సంబంధించి అధికారిక ఎజెండా వస్తే మరింత క్లారిటీ రానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…