AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ రియాక్షన్.. ఏమన్నారంటే..?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తమ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని కితాబిచ్చారు. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకున్నామన్నారు. కొత్తగూడె కార్పొరేషన్‌లో సీపీఐకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెంలో హంగ్ ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి రాజకీయం వేడెక్కింది.

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ రియాక్షన్.. ఏమన్నారంటే..?
KTR
Venkatrao Lella
|

Updated on: Feb 13, 2026 | 5:33 PM

Share

తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల్లో తమ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని, 750 వార్డుల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్న ఆయన.. తమ విజయంతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయని అన్నారు. 117 స్థానాల్లో తమకు మంచి ఫలితాలు వచ్చాయని, 750 వార్డుల్లో విజయం సాధించామని తెలిపారు. చాలాచోట్ల అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించిన కేటీఆర్.. ఇప్పటికే బేరసారాలు మొదలుపెట్టారని అన్నారు. సిగరేణి ప్రాంతంలో సీపీఐతో కలిసి పోటీ చేశామని, ఆ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకునేందుకు సీపీఐతో కలిసి పోటీ చేసినట్లు వెల్లడించారు.

కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్

కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్ ఫలితం వచ్చింది. దీంతో సీపీఐకి ఓపెన్ అన్‌కండిషనల్‌ ఆఫర్ కేటీఆర్ ప్రకటించారు. మేయర్‌ సీటు సీపీఐకే ఇస్తామని, కలిసొస్తామంటే రెడీ అంటూ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీని నిలువరించడం కోసం సిద్దమని ప్రకటించారు. కొత్తగూడెంలో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్, సీపీఐకి చెరో 22 స్థానాలు వచ్చాయి. ఇక మిగతా చోట్ల బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సీపీఎం 1, స్వతంత్రులు 6 చోట్ల గెలుపొందారు. కూనంనేని, ఎంపీ రఘురామిరెడ్డి ఇద్దరికీ చెరో ఎక్స్‌అఫీషియోతో కూడా హంగ్ ఏర్పడనుంది. పొత్తు లేకపోవడంతో హంగ్ ఏర్పడగా.. బీఆర్ఎస్ కూడా కలిసొస్తుందనే ఆశలో సీపీఐ ఉంది. కేటీఆర్ సీపీఐకు ఓపెన్ ఆఫర్ ప్రకటించడంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.

బీజేపీ స్పందన

ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యాలతో కాంగ్రెస్ గెలిచిందన్నారు. బీజేపీ బలం పెరిగిందన్న ఆయన.. బీఆర్‌ఎస్ ఓట్ల శాతం తగ్గిందన్నారు. కొత్తగూడెం, వైరాలో తొలిసారి విజయం సాధించామని, దాదాపు 20 శాతం ఓట్లు తమకు పెరిగాయన్నారు. ఇండిపెండెంట్ల మద్దతుతో మరికొన్ని ఛైర్మన్ సీట్లు గెలుస్తామని, మజ్లిస్ డైరెక్షన్‌లో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓటేశారన్నారు. నారాయణపేట, ఆదిలాబాద్‌లో విజయం సాధిస్తామని, 350 వార్డులు గెలుస్తామన్నారు.

Follow Us