Telangana: నగదుతో పాటు తులం బంగారం.. మరో పథకంపై సీఎం కీలక ప్రకటన

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలలోపు మరో రెండు పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్‌ ప్రణాళికలు రచిస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నెలకు రూ. 2500 ఆర్థిక సహాయంతో పాటు సబ్సిడీ కింది రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ను అందించే పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్‌ ఆలోచనలో ఉన్నట్లు...

Telangana: నగదుతో పాటు తులం బంగారం.. మరో పథకంపై సీఎం కీలక ప్రకటన
CM Revanth

Updated on: Jan 27, 2024 | 5:34 PM

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే మహా లక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించింది. అలాగే.. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే మిగతా పథకాలను సైతం వీలైనంత త్వరగా అమలు చేయాలని చూస్తోంది.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలలోపు మరో రెండు పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్‌ ప్రణాళికలు రచిస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నెలకు రూ. 2500 ఆర్థిక సహాయంతో పాటు సబ్సిడీ కింది రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ను అందించే పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్‌ ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు సంబంధించి రేవంత్‌ రెడ్డి శనివారం కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తులం బంగారం ఇవ్వడంతో పాటు.. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా నిధులు విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించి, అంచనాలు తయారు చేయాలన్నారు. ఈ సమీక్షలో పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..