తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడంతో ఆ దిశగా కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. జూన్ రెండు నాటికి తొమ్మిది సంవత్సరాలు పూర్తై పదో సంవత్సరంలోకి తెలంగాణ అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా 21 రోజుల దశాబ్ది వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటేలా రాష్ట్రమంతా పండగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే మంత్రి హరీశ్ రావు ఉత్సవాలకు సంబంధించి మంత్రులు, వివిధ శాఖల అధికారులతో చర్చించి ముసాయిదా ప్రణాళిక రూపొందించారు. జూన్ రెండున హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, అక్కడి ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన విజయాలు చాటి చెప్పేలా శాఖలవారీగా డాక్యుమెంటరీలు రూపొందనున్నాయి.
ఈ క్రమంలో వివిధ శాఖలు అందజేసిన ప్రతిపాదనలపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఏర్పాట్లన్నీ పకడ్బంధీగా ఉండాలని.. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. డాక్టర్ BR అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ CV ఆనంద్, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, సోమేశ్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవ ప్రణాళికకు ఈ సమావేశంలో తుది రూపు ఇవ్వనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..