AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchayat Awards: తెలంగాణ పల్లెలకు జాతీయ అవార్డుల పంట.. హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌..

తెలంగాణకు అవార్డుల పంటపండటంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వక్తం చేశారు. తెలంగాణ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి ఇతివృత్తంతో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయి.

Panchayat Awards: తెలంగాణ పల్లెలకు జాతీయ అవార్డుల పంట.. హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌..
Telangana CM KCR
Sanjay Kasula
|

Updated on: Apr 17, 2023 | 7:22 PM

Share

కేంద్ర ప్రభుత్వం అందించిన పంచాయతీరాజ్ జాతీయ అవార్డుల్లో తెలంగాణకు అవార్డుల పంటపండటంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వక్తం చేశారు. తెలంగాణ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి ఇతివృత్తంతో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి చేతులమీదుగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను అందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ కైవసం చేసుకోవడం విశేషమన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లోని తొమ్మిది విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేయగా.. ఎనిమిది విభాగాల్లో తెలంగాణ అవార్డులను సాధించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయని అన్నారు. ఇందులోంచి 13 అవార్డులు తెలంగాణకు రావడం విశేషం అని ప్రశంసించారు.

పల్లె ప్రగతి సహా గ్రామీణాభివృద్ధి దిశగా దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని సీఎం కేసీఆర్ అన్నారు. పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచిందన్నారు. అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్ఫూర్తితో తెలంగాణ ఆదర్శంగా దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధి కోసం కృషి కొనసాగిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో సోమవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ అవార్డులను, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. కొన్ని అవార్డులను కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కూడా అందజేశారు. అత్యధిక అవార్డులు అందుకున్న తెలంగాణను ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్రపతి. తెలంగాణ నుంచి వెళ్లిన బృందంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఉన్నారు. తెలంగాణలో చేపట్టిన ప్రజోపయోగ పనులు.. వాటిని కేంద్రం గుర్తించి దేశంలో అమలు చేస్తోన్న తీరును ఈ కార్యక్రమంలో వివరించారు మంత్రి దయాకర్‌రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం