CM KCR: రైస్ మిల్లర్లకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌.. ఆ కాలానికి సీఎస్టీ పన్ను బకాయిలు రద్దు..

|

Nov 28, 2022 | 9:43 PM

తెలంగాణ రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. వివరాల్లోకి వెలితే.. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భాల్లో..

CM KCR: రైస్ మిల్లర్లకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌.. ఆ కాలానికి సీఎస్టీ పన్ను బకాయిలు రద్దు..
CM KCR
Follow us on

వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు చేపడుతామన్నారు. ఈ సందర్భంగా.. ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే (01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో) 2 శాతం సిఎస్టీ పన్ను బకాయిని సిఎం రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా బియ్యం ఎగుమతులను ప్రోత్సహించి తెలంగాణ రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు .

వివరాల్లోకి వెలితే.. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భాల్లో గతంలో సి- ఫారం దాఖలు చేస్తే (సిఎస్టీ) టాక్స్ లో 2 శాతం రాయితీని కల్పించే విధానం ఉండేది. ఈ విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలయ్యింది. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభంలో అమలయ్యింది. కాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సి- ఫారం సబ్మిట్ చేయలేదనే కారణం చేత బియ్యం ఎగుమతి దారులకు సిఎస్టీలో 2 శాతం పన్ను రాయితీ కల్పించడం నిలిపివేయడం జరిగింది. సి ఫారం సబ్మిట్ చేయలేదనే పేరుతో తెలంగాణ రైస్ మిల్లర్లకు 2 శాతం పన్ను రాయితీని అవకాశాన్ని కల్పించకపోవడం వలన తాము ఆర్థికంగా నష్ట పోతున్నామని గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులు అభ్యర్థిస్తున్నారు.

బియ్యం ఎగుమతి చేశామా లేదా అనేది నిర్దారణ చేసుకోవడమే సి ఫారం ఉద్దేశమని తెలిపారు. అది లేనంత మాత్రాన తమ హక్కును ఎట్లా రద్దు చేస్తారని వారు పలుమార్లు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నారు. సీ ఫారం బదులు తాము ఎగుమతులు చేసినట్లుగా నిర్దారణ చేసుకోవడానికి ఇతర పద్దతులను పరిశీలించాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని కోరారు. తాము చేసిన లోడింగ్ .. రిలీజింగ్, సర్టిఫికేట్లు.. లారీలు రైల్వే పర్మిట్లు, వే బిల్లులు తదితర ఏ ప్రూఫ్ నైనా తాము సబ్మిట్ చేస్తామని. వాటిని పరిగణలోకి తీసుకుని రెండేండ్ల కాలానికి సంబంధించిన 2 శాతం పన్నును రద్దు చేయాలని కోరారు.

ఇదే విషయాన్ని నేటి దామరచర్ల పర్యటన సందర్భంగా, మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కూడి తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోషియేషన్ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్జప్తి చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో బియ్యం ఎగుమతులను ప్రోత్సహించిడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యంగా భావించారు. తెలంగాణ రైస్ మిల్లర్ల అభ్యర్థనను పరిశీలించి, ఎటువంటి సాయం చేయవచ్చునో ఆలోచించాలని, తక్షణమే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు.

అటు రైస్ మిల్లర్లకు ఇటు తెలంగాణ రైతులకు ప్రయోజనం కలిగే విధంగా సమాలోచన చేయాలని రైతుబంధు సమితి అధ్యక్షున్ని సిఎం ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట.. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసిన సందర్భంలో సి ఫారం బదులు అందుకు సామానమైనచ లోడింగ్ సందర్భంగా ఇచ్చే సర్టిపికేట్లు కానీ, బియ్యం అన్ లోడ్ చేస్తున్న సందర్భంగా వుండే కాయితాలు, వే బిల్లులు, లారీలు రైల్వే ల ద్వారా చేసే రవాణా పర్మిట్లకు సంబంధించిన కాయితాలు, తదితర సంబంధిత పర్మిట్ సర్టిఫికేట్లు ఏవి వున్నా వాటిని సబ్మిట్ చేసి తాము ఎగుమతి చేసినట్టు నిర్థారించుకుంటే వాటిని సి ఫారం ప్లేస్ లో పరిగణలోకి తీసుకోవచ్చునని , ఈ నేపథ్యంలో 01.04.2015 నుంచి 30.06.2017 కాలానికి నడుమ రాయితీ ఇవ్వకుండా నిలిపివేసిన 2 శాతం పన్నును రద్దు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.

తమ అభ్యర్థనను మన్నించి తక్షణమే జీవో జారీ చేసినందుకు తెలంగాణ రైస్ మిల్లర్లు, రైతాంగం తరఫున ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. సిఎం కెసిఆర్ ని సోమవారం ప్రగతి భవన్ లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం