CS Somesh Kumar: ఉన్నపళంగా రిలీవ్‌ కావాలి.. ఏపీ ప్రభుత్వానికి సోమేష్‌కుమార్‌ రిపోర్ట్‌ చేయాలని కేంద్రం ఆదేశాలు

తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్‌ కుమార్‌ రిలీవ్‌ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆదేశించింది. ఈనెల 12లోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి..

CS Somesh Kumar: ఉన్నపళంగా రిలీవ్‌ కావాలి.. ఏపీ ప్రభుత్వానికి సోమేష్‌కుమార్‌ రిపోర్ట్‌ చేయాలని కేంద్రం ఆదేశాలు
CS Somesh Kumar

Updated on: Jan 10, 2023 | 7:55 PM

హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్‌ కుమార్‌ రిలీవ్‌ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆదేశించింది. ఈనెల 12లోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ ఏపీ కేడర్‌కు వెళ్లాలని తీర్పు చెప్పింది హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విభజన సమయంలో ఆయన్ను ఏపీకి కేటాయించింది కేంద్రం. దానిపై సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌-క్యాట్‌ను ఆశ్రయించారు సోమేష్‌. అప్పట్లో ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది క్యాట్‌. దానిపై 2017లో హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది కేంద్రం. అప్పటి నుంచి కేసు విచారణ జరిపి ఇప్పుడు తీర్పు చెప్పింది ధర్మాసనం.

2016లో క్యాట్‌ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది హైకోర్టు. క్యాట్‌ తన పరిధి దాటి వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. బ్యూరోక్రాట్లను కేటాయించే అర్హత కేంద్రానికి మాత్రమే ఉందని తేల్చి చెప్పింది. విభజన సమయంలో అధికారుల బదలాయింపు కోసం వేసిన ప్రత్యూష సిన్హా కమిటీ రిపోర్టుకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో సోమేష్‌కుమార్‌ సీనియారిటీకి ఇబ్బంది రాకూండా చూడాలని ఆదేశించింది.

గతంలో పీకె మహంతి రిటైర్మెంట్‌ డేట్‌పై సోమేష్‌కుమార్‌ చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు పేర్కొంది. 2014 మేలోనే రిటైర్మెంట్ కోసం మహంతి దరఖాస్తు చేసుకున్నారని, కాబట్టి అధికారుల జాబితాలో ఆయన పేరు ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. తీర్పు అమలును 3 వారాలు వాయిదా వేయాలన్న సోమేష్‌ తరపు న్యాయవాది వాదనను తిరస్కరించింది.

తీర్పు వచ్చిన కొద్ది గంటల్లోనే కేంద్రంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ – డీఓపీటీ విభాగం నుంచి సోమేష్‌ రిలీవ్‌కు ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ వెంటనే రిలీవ్‌ కావాలని సోమేష్‌ను ఆదేశించింది. 12వ తేదీలోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు సోమేష్‌కుమార్‌. నెక్ట్స్‌ ఏం చేయాలన్న దానిపై చర్చించారు. మరోవైపు హైకోర్టు తీర్పును స్వాగతించింది కాంగ్రెస్‌. సీఎస్‌గా సోమేష్‌ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు రేవంత్‌రెడ్డి.

సోమేష్‌కుమార్ స్థానంలో సీఎస్‌ రేసులో ముగ్గురు అధికారులు ఉన్నారు. ఇందులో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ రజత్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ
అరవింద్ కుమార్ ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం