Obulapuram Illegal Mining: ఓబుళాపురం మైనింగ్‌ కేసు – గాలి జనార్దన్‌రెడ్డిని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి సహా ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఏ1గా బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్ధన్‌రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్‌, ఏ4 ఒఎంసి కంపెనీ, ఏ7 మెఫజ్ అలీఖాన్‌ను దోషులుగా నిర్ధారించింది.

Obulapuram Illegal Mining:  ఓబుళాపురం మైనింగ్‌ కేసు - గాలి జనార్దన్‌రెడ్డిని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు..
Obulapuram Mining Case

Updated on: May 06, 2025 | 4:37 PM

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్‌ కేసులో కోర్టు 15 ఏళ్ల విచారణ అనంతరం తుది తీర్పు ఇచ్చింది నాంపల్లి సీబీఐ కోర్టు. ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. గాలి జనార్దన్‌రెడ్డిని దోషిగా తేల్చింది. బీవీ శ్రీనివాసరెడ్డి,  మెఫజ్‌ అలీఖాన్‌, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌గా ఉన్న వీడీ రాజగోపాల్‌ను కూడా దోషులుగా ప్రకటిస్తూ.. శిక్షలు ఖరారు చేసింది. వీరికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,  అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంలను నిర్దోషిలుగా ప్రకటించింది.

ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పై 2009లో అప్పటి ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణకు ఆదేశించింది కేంద్రం.  2007 జూన్‌ 18న అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం దగ్గర 95 హెక్టార్లలో గాలి జనార్ధన్‌రెడ్డి కంపెనీకి ఇనుప ఖనిజం గనుల లీజులు కట్టబెట్టింది అప్పటి వైఎస్‌ ప్రభుత్వం. అయితే, ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా-అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో 2009 డిసెంబర్‌ 7న కేసు నమోదు చేసింది సీబీఐ.  2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. గాలి జనార్దన్‌రెడ్డి, మెఫజ్‌ అలీఖాన్‌, సబితా ఇంద్రారెడ్డి,  వీడీ రాజగోపాల్‌, కృపానందం, బీవీ శ్రీనివాసరెడ్డిలను ఛార్జిషీట్‌లో నమోదు చేసింది. మొత్తం 4 అభియోగపత్రాల్లో 9 మందిని నిందితులుగా చేర్చింది.

ఓఎంసీ యజమానులైన గాలి జనార్ధన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డితోపాటు అప్పటి గనులశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డితోపాటు అధికారులైన కృపానందం, శ్రీలక్ష్మి, వీడీ రాజగోపాల్‌, లింగారెడ్డిపై అభియోగాలు నమోదు చేసింది. ఓఎంసీ ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఇనుప ఖనిజం ఉపయోగించేలా మొదట ఫైల్‌ రూపొందించి.. తర్వాత ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్‌ అనే పదం తొలగించి జీవో ఇచ్చినట్టు ప్రధాన అభియోగం. అలాగే కేటాయించిన భూముల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరిపారని,. ఏపీ-కర్నాటక సరిహద్దు రాళ్లను మార్చడం.. సుగులమ్మ ఆలయాన్ని కూల్చడం.. అటవీ భూముల ఆక్రమణ.. అక్రమంగా ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించారని అభియోగాలు మోపింది.  మే నెలలోగా విచారణ పూర్తిచేయాలన్న సుప్రీం ఆదేశాలతో.. వాదనలు ముగించి.. మంగళవారం తుది తీర్పు ఇచ్చింది నాంపల్లి సీబీఐ కోర్టు. ఈ కేసుకు సంబంధించి  2022లో ఐఏఎస్‌ శ్రీలక్ష్మిని కోర్టు డిశ్చార్జి చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.