Patnam Mahender Reddy -Tandur CI: వికారాబాద్జిల్లా తాండూరులో అధికార TRS పార్టీలో విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాండూరు నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన పైలట్ రోహిత్రెడ్డి..ఆ తర్వాత TRS పార్టీలో చేరారు. ఆ తర్వాత మహేందర్రెడ్డిని సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీని చేశారు. అయితే తాండూరు నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లు వీళ్లిద్దరి వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. అనేక సార్లు ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. మరోవైపు అటు ఈ ఇద్దరు నేతల మధ్య అధికారులు కూడా నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తాండూర్ సీఐ రాజేందర్రెడ్డిని బండ బూతులు తిట్టారు MLC మహేందర్ రెడ్డి. ఓ ప్రజాప్రతినిధి, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ని బండబూతులు తిట్టడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం రోజున MLC మహేందర్ రెడ్డి, MLA రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయంపై MLC మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా? నీ అంతు చూస్తానంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.
TRS ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతు పురాణంపై పోలీసు అధికారుల సంఘం సీరియస్ అయ్యింది. ఆయనపై 353, 504, 506 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. పట్నం మహేందర్రెడ్డిపై చర్యలకు పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది.
మొత్తానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డిపై నోటిదూల వ్యవహారం కలకలం రేపుతోంది. విమర్శలు, పోలీసుల కేసుల నేపథ్యంలో ఆయన ఇవాళ స్పందిస్తారా..? పోలీసులకు సారీ చెబుతారో లేదో వేచి చూడాలి. పట్నం వర్సెస్ పైలెట్ పోరులో నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read: