
స్టాక్ మార్కెట్లో భారీ లాభాల పేరుతో హైదరాబాద్కు చెందిన సైబర్ మోసగాళ్లు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఇంజనీర్ను రూ.1.5 కోట్లకు పైగా మోసం చేశారు. పుణెలోని సిటీ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న 41 ఏళ్ల ఇంజనీర్ ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసింది. గత ఏడాది నవంబర్లో బాధితుడి సోదరి ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఓ యాడ్ చూసి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై ఆసక్తి చూపించింది. లింక్ క్లిక్ చేయగానే ఆమెను ‘Z926 one-to-one Service’, ‘L Accel Partners Stock Exchange Group’ అనే వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. వీటిలో పెట్టుబడులు పెడితే 500 శాతం వరకు లాభాలు వస్తాయని మోసగాళ్లు ఆశ చూపించారు.
తమను ‘దీక్షా భండారి’గా పరిచయం చేసుకున్న ఓ మహిళ, ముందుగా రూ.60 వేల పెట్టుబడి పెట్టాలని సూచించింది. అనంతరం ‘ACEFD’, ‘ACESEC’ పేర్లతో ఉన్న యాప్లను డౌన్లోడ్ చేయించి పెట్టుబడుల వివరాలు, లాభాలు చూపిస్తూ నమ్మకం కలిగించారు. సోదరి ద్వారా బాధితుడి వివరాలు పొందిన మోసగాళ్లు అతడిని ఈ పెట్టుబడుల్లోకి లాగారు. నవంబర్ 19, 2025 నుంచి జనవరి 14, 2026 వరకు బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరూ కలిసి ఆరు బ్యాంకు ఖాతాల నుంచి తొమ్మిది ఖాతాలకు మొత్తాలు బదిలీ చేశారు. డిసెంబర్ 9న మోసగాళ్లు బాధితుడి ఖాతాలో రూ.1.5 లక్షలు జమ చేసి, యాప్లో రూ.36 కోట్ల లాభం వచ్చినట్లు చూపించారు. డబ్బు విత్డ్రా చేయాలని ప్రయత్నించగా.. సర్వీస్ ఛార్జీల పేరుతో రూ.36 లక్షలు, ఆదాయపు పన్ను డిపాజిట్గా మరో రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పుడే మోసమని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై TGCSB పోలీసులు BNS సెక్షన్లు 61(2), 318(4), 319(2), 338, 340(2)తో పాటు ఐటీ చట్టంలోని 66(C), 66(D) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి: షూట్లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..