
గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేస్తోంది. గ్రామీణ స్థానిక సంస్థల అభివృద్ధి కోసం ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఆయా రాష్ట్రాలకు విడుదల చేసింది. గత దశాబ్దకాలంలో కేంద్రం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రూ.11 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. 2015 -16 నుండి 2019 -20 వరకు 5,060 కోట్లు విడుదల చేయగా.. 2020 -21 నుండి 2025-26 వరకు కేటాయింపులు 80 శాతం పెరిగి 9,050 కోట్లకు చేరుకున్నాయి. అందులో 6,051 కోట్ల నిధులు జనవరి, 2026కి ముందే విడుదల అయ్యాయి. క్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం వల్ల జవాబుదారీతనం, పారదర్శకత మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తుంది. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో ఉన్న 29 అంశాల ప్రకారం.. స్థానిక అవసరాల కోసం పంచాయతీలు అన్టైడ్ గ్రాంట్లను ఖర్చు చేయవచ్చు. టైడ్ గ్రాంట్లను కేవలం పారిశుధ్యం, ODF స్థితి నిర్వహణ వంటి ప్రాథమిక సేవలకు ఉపయోగించవచ్చు. ఇందులో గృహ వ్యర్థాల నిర్వహణ, ముఖ్యంగా మానవ మల విసర్జన నిర్వహణ, తాగునీటి సరఫరా, వర్షపు నీటి సేకరణ, నీటి రీసైక్లింగ్ వంటివి ఉంటాయి.
గ్రామీణ స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయింపుల కింద ఈ సంవత్సరం తెలంగాణ ఇప్పటివరకు 1,034.42 కోట్ల నిధులు అందుకుంది. ఈ నిధులతో రాష్ట్రంలోని 12,702 గ్రామ పంచాయతీలకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ఫిబ్రవరి 5న తెలంగాణ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 259.36 కోట్లు, ఆ తర్వాత రెండవ విడతగా 387.1 కోట్లు విడుదలయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులలో మూడవ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. దీని ద్వారా తెలంగాణకు 387.96 కోట్ల నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇటీవలే ఈ నిధులు విడుదల చేశారు. ఈ నిధులకు సంబంధించిన ఖర్చులకు వినియోగ ధృవీకరణ పత్రాలు కేంద్రానికి సమర్పించిన తర్వాత మిగిలిన 2000 కోట్ల నిధులు విడుదలకానున్నాయి.15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు నిధులు అందిన వెంటనే ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖలు, 10 పని దినాలలోపు ఎటువంటి కోతలు లేకుండా సంబంధిత గ్రామ పంచాయతీలన్నింటికీ ఆయా నిధులను వెంటనే బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఈ నిధులను 10 పని దినాలలోపు ఆయా గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాల్సి ఉంటుంది.10 పని దినాలకు మించి ఏదైనా ఆలస్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాల కోసం తీసుకున్న మార్కెట్ రుణాలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ రేటు ప్రకారం, గ్రామ పంచాయతీలకు కూడా వడ్డీతో కలిపి కేంద్ర నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి గ్రామ పంచాయతీ నిధుల వినియోగం కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను నిర్వహించాలి. దీనిని PFMS పోర్టల్లో ఒక ప్రత్యేకమైన ఏజెన్సీ కోడ్తో నమోదు చేసి పారాదర్శకతతో నిధుల బదిలీ, ఖర్చు, యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సమర్పించాల్సి ఉంటుంది