1049 ఎకరాల భూ రికార్డులు తారుమారు? బొంరాస్‌పేట రైతుల ఆందోళన

మేడ్చల్‌ జిల్లాలోని బొంరాస్‌పేట భూముల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. 1,049 ఎకరాల భూ రికార్డులు తారుమారయ్యాయని రైతులు ఆరోపిస్తూ శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని, అక్రమ బదలాయింపులు జరిగాయని ఆరోపించారు. రైతులకు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు.

1049 ఎకరాల భూ రికార్డులు తారుమారు? బొంరాస్‌పేట రైతుల ఆందోళన
Bomraspet Farmers Protest

Updated on: Aug 15, 2026 | 6:43 PM

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో భూ రికార్డుల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ భూములను కబ్జా చేసి, రెవెన్యూ రికార్డులను మార్చేశారంటూ శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. బొంరాస్‌పేటలో సుమారు 1,049 ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేశారని రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైవేపై కూడా నిరసన చేపట్టారు. తమ భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తప్పుడు రికార్డులను సృష్టించి ఒకరి భూమిని మరొకరి పేరుపై అక్రమంగా బదలాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. భూములు ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు పంపడంతో తమ పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు ఆందోళన చేస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ అదే మార్గంలో వెళ్లింది. దీంతో రైతులు ఆయనను కలిసి తమ సమస్యను వివరించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను క్లియర్ చేసి కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించారు. రైతుల సమస్యపై రాజకీయ పార్టీల నేతలు స్పందించడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది. రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. ఒకరి భూమిని మరొకరి పేరుపై ఎలా బదలాయిస్తారని ప్రశ్నించారు. భూ రికార్డుల వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 వేలకు పైగా పట్టాలను రైతులకు తెలియకుండానే 22ఏ జాబితాలో చేర్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2028లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత బొంరాస్‌పేట భూములను రైతులకు తిరిగి ఇప్పిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా రైతుల ఆందోళనపై స్పందించారు. 22ఏ జాబితాలో భూములను చేర్చి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. బ్రోకర్లు, కొందరు అధికారులు కలిసి భూములను కాజేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు సమస్యను లేవనెత్తుతామని స్పష్టం చేశారు.

మరోవైపు ప్రభుత్వం మాత్రం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఎలాంటి వివాదాలు, కోర్టు కేసులు లేని భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 22ఏ భూముల వివాదాలపై ఇప్పటికే ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందని, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే బొంరాస్‌పేటలో 1,049 ఎకరాల భూములపై రైతులు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ, అధికారిక రికార్డుల పరిశీలన తర్వాతే అసలు వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ వ్యవహారం రాజకీయంగానూ, రైతుల హక్కుల పరంగానూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us