
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం చిత్తారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం కట్టమైసమ్మను దర్శించుకుని పూజులు నిర్వహిస్తారు. అనంతరం సూరారం కాలనీలోని రాంలీలా మైదానంలో ప్రారంభ సభ ఉంటుంది. ప్రజా సంగ్రామయాత్ర నాలుగో విడత 10 రోజుల పాటు సాగనుంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్తో పాటు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.
ఈ యాత్రలో మొత్తం 115.3 కిలోమీటర్లు నడవనున్నారు. దారి పొడవునా ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో 11 వందల 28 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మొత్తం 18 జిల్లాలు, 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు చేపట్టే యాత్రతో కలిపి.. 8 పార్లమెంట్ నియోజకవర్గాలతో 48 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి అవుతుంది.
పాదయాత్రలో భాగంగా ప్రతి రోజు సగటున బండి సంజయ్ 11 కిలోమీటర్ల మేర యాత్రను సాగించనున్నారు. గతంలో రోజుకు సుమారుగా 15 కిలోమీటర్లకు పైగా నడిచారు. మహా నగరంలో సమస్యలు అధికంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలను కలిసి, వారి సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో రోజుకు 10 నుంచి 11 కిలోమీటర్లకే కుదించుకున్నారు.
ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విమోచన వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో.. ఆ ఒక్కరోజు యాత్రను వాయిదా వేసుకుంటున్నారు. 22న పెద్ద అంబర్పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద.. పాదయాత్రను బండి సంజయ్ ముగించనున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం