Etela Rajendar: హుజూరాబాద్ ప్రజల బిక్ష నా పదవి.. ఈ విజయం వారికే అంకితంః ఈటల రాజేందర్

|

Nov 03, 2021 | 12:43 PM

అధికార పార్టీ నేతలు ఏకమైన ఎన్ని ప్రలోభాలు పెట్టిన చివరికి ధర్మమే గెలిచిందని భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు.

Etela Rajendar: హుజూరాబాద్ ప్రజల బిక్ష నా పదవి.. ఈ విజయం వారికే అంకితంః ఈటల రాజేందర్
Etela Rajendar
Follow us on

BJP leader Etela Rajendar: అధికార పార్టీ నేతలు ఏకమైన ఎన్ని ప్రలోభాలు పెట్టిన చివరికి ధర్మమే గెలిచిందని హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నిక ఫలితాల అనంతరం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. దళిత బంధు వాళ్ల దగ్గర ఎందుకు రాలేదో నిలదీస్తానన్నారు. ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారని, డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. హుజురాబాద్‌లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారన్నారు. కుల ప్రస్తావన తెచ్చినా..ప్రజలు తనవైపే నిలబడ్డారని, కేసీఆర్‌ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. హుజురాబాద్‌లో ప్రచారం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానని, వాళ్ల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తానని ఈటల తెలిపారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసినవారి నియోజకవర్గాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు.

టీఆరఎస్ పార్టీ నుండి వెళ్లగొట్టిన తరువాత నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ బిజెపి అన్న ఆయన.. తనకు అండగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఈటల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన బీజేపీ నేతలకు ధన్యవాదాలు చెప్పారు. ఇది కేసీఆర్‌ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన గెలుపుగా అభివర్ణించారు. హుజురాబాద్‌ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఈటల స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు ఓట్లు వేయాలని పసుపు బియ్యంతో ప్రమాణం చేయించుకున్నారని ఆరోపించారు. దళిత బంధు పది సార్లు ఇస్తామన్నా ధర్మం వైపే ప్రజలు నిలబడ్డారని, డబ్బులు పంచినోళ్ళను తన్ని తరిమేశారన్నారు. తెలంగాణలో దీపావళి నిన్ననే జరిగిందని ఈటల వ్యాఖ్యానించారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలా మంది ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు అందరి సహకారం అందిందన్న ఈటల.. సోషల్ మీడియాలో ప్రజలకు అర్థం అయ్యే విధంగా గొప్పగా మాట్లాడి ప్రజలను చైతన్య పరిచారన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా గెలుపునకు కృషీ చేసిన వారందరికి రుణపడి ఉంటానన్నారు. తెలంగాణలో ప్రజలు నిన్ననే దీపావళి చేసుకున్నారన్న ఆయన.. గతంలో ఒక లక్ష నాలుగు వేలు వేస్తే ఇప్పుడు దాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయన్నారు. ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఖాతాల్లో వేసినా.. దళితులు తనకే అండగా నిలిచారన్నారు. అన్ని కుల సంఘాల నాయకులు ఆశీర్వాద సభలు పెట్టీ నన్ను ఆశీర్వదించారన్నారు. కుట్రదారులు ఎప్పుడు కుట్రలో నాశనమయిపోతరన్న ఈటల.. రెండు గుంటల మనిషి నాలుగు కోట్ల ఎలా ఖర్చు చేశారో లెక్క చెప్పాలన్నారు. ఎప్పుడు తప్పు చేయని బిడ్డ ఈటల.. రాబోయే కాలంలో కూడా ఈటల తప్పు చేయడని స్పష్టం చేశారు.

Read Also…  GHMC: జీహెచ్ఎంసీలో మరోసారి పొలిటికల్ హీట్.. బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందడి షురూ..