పోలీసులు నో పర్మిషన్ అన్నారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభా వేదిక మారినా.. రూట్ మ్యాప్లో చిన్న మార్పులు చోటుచేసుకున్నా కమలనాథుల్లో జోష్ మాత్రం తగ్గలేదు. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన తర్వాత కరీంనగర్ నుంచి నిర్మల్కు వెళ్లిన బండి సంజయ్.. అడెల్లి పోచమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సారంగపూర్ వరకు 3 కిలోమీటర్లమేర పాదయాత్ర చేశారు. సోమవారం రాత్రి గుండెగాంలో బస చేశారు. మంగళవారం మధ్యాహ్నం 1.30కి భైంసా శివారులో బహిరంగ సభ జరగనుంది. నిర్మల్ నేషనల్ హైవే పక్కన ఉన్న గణేశ్ ఇండస్ట్రీ ప్రాంగణంలో దీన్ని నిర్వహించాలని నిన్న రాత్రి 11 గంటలకు పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఈ సభకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు.
ఈ పాదయాత్ర ప్రారంభించకుండా ఆదివారం పోలీసులు బండి సంజయ్ని అడ్డుకోవడంతో.. సోమవారం దీనిపై హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు.. భైంసా సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే సభ నిర్వహించుకోవాలని తెలిపింది. అలాగే భైంసా సిటీ గుండా పాదయాత్ర వెళ్లకూడదని సూచించింది. పాదయాత్రలో పాల్గొన్నవారు ఎలాంటి ఆయుధాలూ వాడకూడదని తెలిపింది. అందుకు అంగీకరించిన బీజేపీ నేతలు.. ఆ ప్రకారమే తమ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నారు.
భైంసా వెళ్లకూడదని, సభను కూడా భైంసా టౌన్కు 3 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని చెప్పింది. 500 మందితో పాదయాత్ర, 3 వేల మందితో సభ జరుపుకోవాలని ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపే మీటింగ్ పెట్టుకోవాలని సూచించింది. ఇతర మతాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని…అలాగే కార్యకర్తలు కర్రలు, ఆయుధాలు వాడొద్దని హైకోర్టు స్పష్టంచేసింది.
హైకోర్టు సూచనల మేరకు సభాస్థలిని మార్చింది బీజేపీ. మాటేగాం, మహాగాంలో స్థలాలను నేతలు పరిశీలించారు. అయితే స్థలాలు అనుకూలంగా లేకపోవడంతో.. పార్డీబి క్రాస్ వద్దనే సభ నిర్వహించాలని నిర్ణయించింది బీజేపీ. సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి, గౌరవ అతిథిగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొంటారని పార్టీవర్గాలు తెలిపాయి.
బీజేపీ భారీ బహిరంగ సభ ఉండటంతో నిర్మల్ జిల్లా భైంసాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. నిన్న అమల్లోకి తెచ్చిన ఈ సెక్షన్ను ఇవాళ కూడా అమల్లో ఉంచుతున్నారు. ఈ కారణంగా భైంసాలో భారీగా పోలీసులు మోహరించారు. అయితే.. 144 సెక్షన్పై పోలీసులు అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఇవాళ బహిరంగ సభ జరగనుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఇది సిటీకి శివారులో జరుగుతోంది కాబట్టి.. శాంతి భద్రతలకు ఎలాంటి సమస్యా రాదనే అభిప్రాయం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం