చచ్చే వయసులో ఇదేం పనిరా.. షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు.. చివరకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు, స్థానికులు గుర్తించగా నిందితుడు పరారయ్యాడు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నా ఇలాంటి ఘటనలు జరగడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడికి కఠిన శిక్ష డిమాండ్ చేస్తున్నారు.

నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.9 సంవత్సరాల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. బాలిక ఏపీలోని కుక్కునూరు మండలం నుంచి వేసవి సెలవులకు తన బంధువుల ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం సమయంలో సదరు బాలిక ఇంటి ఎదురుగా ఉన్న పద్ధం లక్ష్మణరావు కిరాణం, పాన్ షాప్నకు వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన షాప్ నిర్వాహకుడు పద్ధం లక్ష్మణరావు కూల్ డ్రింక్ ఇచ్చి.. ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.. దీంతో ఆ బాలిక భయంతో గట్టిగా కేకలు వేసింది.
బాలిక కేకేలు వేయడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో బాలిక అక్కడ జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది.. బాధిత కుటుంబ సభ్యుల సమాచారంతో అశ్వారావుపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
