
ఆదిలాబాద్ జిల్లాలోని ఆ గ్రామంలో ఏడు దశాబ్దాలుగా అసలు సర్పంచ్ ఎన్నికల ముచ్చటే లేదు. పంచాయితీ ఎన్నికల్లో ఆ ఊరు ఓటు వేసిన దాఖలాలే లేవు. అందుకు కారణం ఆ గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏడు దశాబ్దాలుగా ఏకగ్రీవం అవుతూ వస్తుండటంమే. ఈసారి ఆ అవకాశమే లేకుండా ఎన్నికలు జరిగి తీరాల్సిందే అని పట్టుపట్టారు ఆశవాహులు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచి నిలవాల్సిందే అని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయంతో ఎట్టకేలకు ఏడు దశాబ్దాల తర్వాత ఆ ఊరికి పంచాయితీ పండుగ వచ్చింది. సర్పంచ్ ఎన్నికల్లో తొలి సారి ఓటు హక్కు వినియోగించుకుని మురిసిపోయారు 70 ఏళ్లు దాటిన వృద్దులు. పుట్టి బుద్దెరిగిన నాటి నుండి ఈ సారే సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేశామంటూ సంబురపడ్డారు ఆ గ్రామ వృద్ద ఓటర్లు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీలో ఏడు దశాబ్దాల ఆనవాయితీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. 69 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతూ వస్తున్న పంచాయితీ స్థానం ఈసారి ఓటుకు సిద్దమైంది. గత ఏడు దశాబ్దాల ఆనవాయితీకి భిన్నంగా ఓటు హక్కు ద్వారా గెలుస్తామంటూ ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు బరిలోకి దిగడంతో బరంపూర్ లో పంచాయతీ ఎన్నికల కల నెరవేరింది. 1956 లో ఏర్పడిన ఈ పంచాయతీకి 69 ఏళ్లుగా పంచాయితీ ఎన్నికలు జరగడం లేదు. ప్రతి ఎన్నికల సమయంలో గ్రామ పెద్దల తీర్మానం తో ఏకగ్రీవాల పర్వం కొనసాగింది.
బరంపూర్ పంచాయతీ పరిధిలో మొత్తం పది వార్డులు ఉన్నాయి. సుమారు మూడు వేల జనభా ఉన్న ఈ గ్రామ పంచాయతీలో 2300 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సర్పంచ్ స్థానానికి పోటీ లేకుండా గ్రామ పెద్దలు పూనుకొని ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. గ్రామ ప్రజలు అందరు ఒకతాటి పైకి వచ్చి గ్రామాన్ని అభివృద్ది చేసుకుంటూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఆ అనవాయితీ కొనసాగే పరిస్థితి లేకుండా పోయింది.
ఈసారి సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని గ్రామ పెద్దలు ప్రయత్నించినా.. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మెస్రం దేవ్ రావు బరిలోకి దిగాడు. బరంపూర్ గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న మదునాపూర్ గ్రామానికి చెందిన మెస్రం దేవ్ రావు బిఆర్ ఎస్ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగగా, కొలాంగూడకు చెందిన సిడాం లక్ష్మణ్ రావు కాంగ్రేస్ మద్దతుతో పోటికి దిగారు. దీంతో మూడవ విడతలో భాగంగా బరంపూర్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం ఆరు గంటలకు ఫలితం వెలువడనుంది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.