
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో అరుదైన, అత్యంత విషపూరితమైన బాండెడ్ క్రేట్ పాము కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఖానాపురం మండలం అశోక్నగర్ గ్రామ శివారులో నలుపు-పసుపు చారలతో ఉన్న ఈ పాము స్థానికుల కంటపడింది. సుమారు ఐదు అడుగుల పొడవున్న పామును చూసిన గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
బాండెడ్ క్రేట్ అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఇవి రాత్రివేళల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో అరుదుగా కనిపించే ఈ జాతి పాములు చైనా, నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం తదితర దేశాల్లోనూ కనిపిస్తాయి. భారత్లో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో వీటి ఉనికి నమోదైనట్లు అధికారులు తెలిపారు. వరంగల్ ప్రాంతంలో ఈ పాము కనిపించడం అరుదైన విషయంగా పేర్కొన్నారు.
ఈ బాండెడ్ క్రేట్ వాహనాల్లో అనుకోకుండా ఎక్కి వరంగల్ ప్రాంతానికి చేరి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. లేదంటే తన సహజ ఆవాసం నుంచి దారితప్పి ఇక్కడికి వచ్చి ఉండే అవకాశముందని చెబుతున్నారు. కాగా, పాము కనిపించిన వెంటనే స్థానికులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నించకుండా అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. విషసర్పాలతో స్వయంగా వ్యవహరించడం ప్రమాదకరమని, శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్ల సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..