Telangana: హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్క్‌లో అరుదైన తెల్లపులి మృతి

| Edited By: Srilakshmi C

May 15, 2024 | 10:08 AM

హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్క్‌లో మగ బెంగాల్ టైగర్ 'అభిమన్యు' మృత్యువాత పడింది. 9 ఏళ్ల కిందట జూ పార్క్ లోనే జన్మించిన అభిమన్యు అనారోగ్య కారణాలతో మంగళవారం మృతి చెందినట్లు జూ పార్క్ క్యూరేటర్ ప్రకటించారు. బెంగాల్ టైగర్ 'అభిమన్యు' అరుదైన తెల్లపులి. దీనికి గతేడాది ఏప్రిల్‌లో ‘నెఫ్రిటీస్‌’ అనే కిడ్నీ సంబంధమై వ్యాధి ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు. దీంతో ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న..

Telangana: హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్క్‌లో అరుదైన తెల్లపులి మృతి
Nehru Zoological Park In Hyderabad
Follow us on

హైదరాబాద్‌, మే 15: హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్క్‌లో మగ బెంగాల్ టైగర్ ‘అభిమన్యు’ మృత్యువాత పడింది. 9 ఏళ్ల కిందట జూ పార్క్ లోనే జన్మించిన అభిమన్యు అనారోగ్య కారణాలతో మంగళవారం మృతి చెందినట్లు జూ పార్క్ క్యూరేటర్ ప్రకటించారు. బెంగాల్ టైగర్ ‘అభిమన్యు’ అరుదైన తెల్లపులి. దీనికి గతేడాది ఏప్రిల్‌లో ‘నెఫ్రిటీస్‌’ అనే కిడ్నీ సంబంధమై వ్యాధి ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు. దీంతో ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న అభిమన్యుకు అప్పటి నుంచి జూ వెటర్నరీ విభాగం అధికారులు అన్ని రకాల వైద్యసేవలు అందిస్తూ వచ్చారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో మే12 నుంచి అభిమన్యు ఆహారం తీసుకోవడం లేదు. రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో మంగళవారం మృతి చెందింది.

అభిమన్యు హైదరాబాద్‌లోని నెహ్రూ జువలాజికల్‌ పార్క్‌లో జనవరి 2, 2015న జన్మించింది. సురేఖ, సమీరా అనే పులులు దీనికి జన్మనిచ్చాయి. తెల్లని ఛాయలో పుట్టిన ఈ అరుదైన బెంగాల్‌ టైగర్‌ ఏడాది నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. జూలో ఎంత మంది నిపుణులు చికిత్స అందించినా పులి ఆరోగ్యం కుదుట పడలేదు. ఈ క్రమంలో మే 5వ తేదీ నుంచి నడవలేక ఉన్నచోటు నుంచి కదలలేకపోయింది. ఈ నెల 12 నుంచి రుమాటిజంతో బాధపడటం ప్రారంభించింది. దీంతో ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేసింది. గత మూడు రోజులుగా జూలోనే మందులతో పాటు ద్రవ ఆహారం అందిస్తూ చికిత్స కొనసాగించినా.. దురదృష్టవశాత్తూ మే14వ తేదీన మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో కన్నుమూసినట్లు జూ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో వెటర్నరీ నిపుణుల సమక్షంలో పోస్ట్‌మార్టం నిర్వహించగా.. అభిమన్యు మరణానికి కిడ్నీ సమస్యలే కారణమని నిర్ధారించబడింది. జూలో వైల్డ్‌లైఫ్ హాస్పిటల్ & రెస్క్యూ సెంటర్‌కి చెందిన అనుభవజ్ఞులైన వెటర్నరీ వైద్యులు, నిపుణులు ఉన్నప్పటికీ తెల్ల పులి అభిమన్యు జీవిత కాలాన్ని పొడిగించలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ జూలో ప్రస్తుతం మొత్తం పులులు 18 ఉన్నాయి. అందులో తెల్లపులులు 8 ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.