పగలు రెక్కీ.. రాత్రికి చోరీలు.. 60కి పైగా సీరియల్‌ దొంగతనాలు చేసిన ఒకేఒక్కడు!

తాళం వేసిన ఇళ్లు, వాణిజ్య దుకాణాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని తూప్రాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నానికి చెందిన కందురి సత్యనారాయణ హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని బస్సుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లి చోరీలు చేసేవాడని పోలీసులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 60కి పైగా చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది..

పగలు రెక్కీ.. రాత్రికి చోరీలు.. 60కి పైగా సీరియల్‌ దొంగతనాలు చేసిన ఒకేఒక్కడు!
Toopran Serial Burglar Arrested

Updated on: Aug 23, 2026 | 3:23 PM

తూప్రాన్‌, ఆగస్ట్‌ 23: తాళం వేసిన వాణిజ్య దుకాణాలు, ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని తూప్రాన్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలంగాణలోని మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎస్‌ఐ గంగరాజు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన కందురి సత్యనారాయణ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. అయితే చోరీలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్న అతడు ఉదయం వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, దుకాణాలను గుర్తించేవాడు. అనంతరం రాత్రి వేళల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. జూన్‌లో తూప్రాన్‌లోని ఓ ఎరువుల దుకాణాన్ని నిందితుడు లక్ష్యంగా చేసుకున్నాడు. సదరు దుకాణం తాళాలను పగులగొట్టి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ చేసి రూ.50 వేలకు పైగా నగదు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన తూప్రాన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం సత్యనారాయణ నల్గొండలోనూ చోరీకి పాల్పడ్డాడు. అక్కడి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో తూప్రాన్‌ పోలీసులు శుక్రవారం అతడిని తమ అదుపులోకి తీసుకుని విచారించారు.

ఇవి కూడా చదవండి

సత్యనారాయణ కుటుంబీకులకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని అక్కడి నుంచి బస్సుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లి చోరీలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నిందితుడు చరవాణిని వినియోగించడని పోలీసులు గుర్తించారు. దీంతో అతడి కదలికలను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో సత్యనారాయణ ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా చోరీలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు సమాచారం. మెదక్‌లోని ఓ మెడికల్‌ దుకాణంలో జరిగిన చోరీ కూడా అతడే చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి మరిన్ని చోరీల వివరాలను రాబట్టేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అతడు ఏయే ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు, ఎంతమేర నగదు, వస్తువులు అపహరించాడు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us