Sundar Pichai: విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. సుందర్ పిచాయ్ మరో కీలక ప్రకటన
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలో త్వరలోనే ఏఐ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల యువతకు ఉద్యోగాలు రావడంతో పాటు వ్యాపారులకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు.

ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. భారత్-అమెరికా ఏఐ కనెక్టివిటీకి కొత్త సబ్సీ ఏర్పాటుతో ఏఐ కనెక్టివిటీ మరింత మెరుగవుతుందన్నారు. ఏపీలోని విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల ఏఐ హబ్కు ప్రణాళిక రూపొందించినట్లు స్పష్టం చేశారు. విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటు అవుతుందని సందర్ పిచాయ్ ప్రకటించారు. కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపిస్తాయన్న సుందర్ పిచాయ్.. ఏఐ నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. భారత్ను సందర్శించిన ప్రతిసారీ మార్పుల వేగం చూసి ఆశ్చర్యపోతున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.
విశాఖలో ఏఐ హబ్
తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఐఐటీ ఖరగ్పూర్కు విశాఖ మీదుగా వెళ్లేవాడినన్న సుందర్ పిచాయ్.. అదే విశాఖ తీరంలో ఇప్పుడు గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ఏర్పాటు కానుండటం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే విశాఖలో గూగుల్ ఏఐ హబ్ పనులు మొదలవుతాయన్నారు. గత కొద్ది రోజులుగా ఈ సమావేశం జరుగుతుండగా.. వివిధ దేశాల నుంచి భారీగా ప్రతినిధులు తరలివచ్చారు. టెక్ దిగ్గజాలు, బిలియనీర్లు, వివిధ దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. భవిష్యత్తులో ఏఐ పాత్ర, ఏఐ అభివృద్ది, ఏఐలో పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సందర్బంగా ఏఐ గురించి పలువురు తమ ప్రసంగం వినిపిస్తున్నారు.
15 బిలియన్ డాలర్లతో ఏఐ హబ్
ఈ సమ్మిట్లో మాట్లాడిన సుందర్ పిచాయ్.. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల ఏఐ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సబ్ సీ కేబుల్ అందుబాటులకి వస్తే కొత్త ఉద్యోగాలు రావడంతో పాటు వ్యాపారులు, ప్రజలకు ఏఐ కటింగ్ ఎడ్జ్ ప్రయోజనాలు అందుతాయన్నారు. భవిష్యత్తులో భారత్లో ఏఐ మరింతగా అభివృద్ది చెందుతుందనే నమ్మకం తనకు ఉందని, గూగుల్ కూడా అందులో భాగస్వామ్యం అవుతుందన్నారు. రానున్న రోజుల్లో ఏఐ వల్ల అన్ని రంగాల్లోనూ సమూలు మార్పులు వస్తాయని, విద్యార్థులు ఇందులో నైపుణ్యాలు పొందటం వల్ల ఉద్యోగాలు పొందవచ్చన్నారు. ఏఐపై భారత్లోేని విద్యార్థులు, ఉద్యోగులకు గూగుల్ తరపున శిక్షణ ఇస్తామన్నారు. ఏఐ వినియోగంపై ఇప్పటికే ప్రధాని మోదీతో తాను చర్చించానని, ఆయనతో తన అభిప్రాయాలు పంచుకున్నట్లు స్పష్టం చేశారు. భారత్లో ఏఐ అభివృద్దిపై చర్చించినట్లు తెలిపారు.
