Vijaya Deepika: దాతల కోసం హైదరాబాదీ అథ్లెట్ ఎదురుచూపులు.. విజయంలో అండగా నిలవాలంటూ..

|

Oct 10, 2024 | 4:44 PM

The World AbilitySport Youth Games Songkhla, Thailand 2024: ఈ గేమ్స్ డిసెంబర్ 1 నుంచి 7 వరకు థాయిలాండ్‌లో నిర్వహించనున్నారు. విజయ దీపికా పారా టేబుల్ టెన్నిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అయితే, ఆర్థిక సమస్యలు వెంటాడుతుండడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది.

Vijaya Deepika: దాతల కోసం హైదరాబాదీ అథ్లెట్ ఎదురుచూపులు.. విజయంలో అండగా నిలవాలంటూ..
Vijaya Deepika Gangapatnam
Follow us on

The World AbilitySport Youth Games Songkhla, Thailand 2024: భారతదేశపు అతి పిన్న వయస్కురాలిగా, జాతీయ రజత పతక విజేతగా నిలిచిన 14 ఏళ్ల విజయ దీపికా గంగపట్నం.. ఎందరో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. క్రీడ పట్ల ఆమెకున్న అచంచలమైన అంకితభావానికి, మక్కువకు నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో ఈవెంట్లలో సత్తా చాటింది. ఇప్పటి వరకు జాతీయస్థాయిలో ఆకట్టుకున్న విజయ దీపిక.. తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు 2024 వరల్డ్ ఎబిలిటీస్పోర్ట్స్ యూత్ గేమ్స్‌లో ఆడే అవకాశం దక్కింది. ఈ గేమ్స్ డిసెంబర్ 1 నుంచి 7 వరకు థాయిలాండ్‌లో నిర్వహించనున్నారు. విజయ దీపికా పారా టేబుల్ టెన్నిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అయితే, ఆర్థిక సమస్యలు వెంటాడుతుండడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. థాయిలాండ్‌లో విజేత నిలిచేందుకు సహాయం చేయాలని కోరుతోంది.

తల్లి ప్రోత్సాహంతో..

విజయ దీపిక తల్లిదండ్రులు గంగాపట్నం విజయ భాస్కర రాజు, అరుణ. విజయ తండ్రి భాస్కర రాజు ప్రస్తుతం హైదరాబాద్‌లో డిఫెన్స్‌లో అకౌంట్స్‌ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి అరుణ ప్రస్తుతం గృహిణి. ఈమె ఒకప్పుడు వెటరన్ టెన్నిస్‌ ప్లేయర్‌. విజయ సోదరుడు విజయ్ తేజ్ జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్‌గా కొనసాగుతూనే మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నాడు. ఇంట్లో క్రీడాకారులు ఉండడంతో.. విజయ దీపికకు క్రీడలపై ఆసక్తి పెరిగింది.

అయితే, విజయ దీపిక ఆస్టియోజెనిసిస్ ఇంపెర్‌ఫెక్టా అనే జన్యుపరమైన వ్యాధితో జన్మించింది. దీంతో పుట్టిన నాటినుంచే ఈమె ప్రయాణం సవాళ్లతో కూడుకున్నది. ఈ డిసీజ్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అవాంతరాలు ఎదురైనా టేబుల్ టెన్నిస్‌లో మెరిసే స్టార్‌గా మారేందుకు ముందుకు సాగుతూనే ఉంది. తల్లి ప్రోత్సాహం ముందు అన్ని అడ్డంకులను ధీటుగా ఎదుర్కొని తన ఇష్టమైన టేబుల్ టెన్నిస్‌లో ముందుకు సాగుతుంది. బిడ్డ కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ తల్లి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కూతురును విజయ పథంలోకి తీసుకొచ్చింది.

కదల్లేని స్థితి నుంచి.. ఛాంపియన్ వరకు..

ఈ డిసీజ్ కారణంగా ఎముకలను చాలా పెళుసుగా మార్చే పరిస్థితిలో ఉంది. మాములు కదలికలతో కూడా విరిగిపోయేలా ఉంటాయి. కానీ, విజయ దీపిక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో 14 సంవత్సరాల వయస్సులోనే జాతీయ స్థాయి పతకాలను గెలుచుకునే చేసింది. ఫిబ్రవరి 2024లో ఇండోర్‌లో జరిగిన జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో విజయ దీపిక కల నెరవేరింది. ఆమె రెండు రజత పతకాలు, ఒక కాంస్యాన్ని గెలుచుకుంది. పారా టేబుల్ టెన్నిస్‌లో విజయ దీపిక వర్ధమాన తారగా మారింది.

దాతలు సహాయం కోసం..

చక్రాల కుర్చీలోనే ఉన్నా.. ఆటపై పట్టు సాధించింది. జాతీయ స్థాయిలో ఇండోర్‌లో జరిగిన యూటీటీ పారా టేబుల్‌ టెన్నిస్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌గా నిలిచింది. యూటీటీ పారా టీటీ నేషనల్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో డబుల్స్‌లోనూ పతకాన్ని ఒడిసి పట్టి, ఔరా అనిపింది. ఈ క్రమంలో విజయ దీపిక మాట్లాడుతూ.. గొప్ప క్రీడాకారిణిగా ఎదగాలన్నది నా కల. అందుకు తగిన ఆర్థిక సాయం కోసం చూస్తున్నాం. ప్రభుత్వం, క్రీడాసంస్థలు, స్పాన్సర్లు ముందుకొస్తే థాయిలాండ్‌లో జరిగే 2024 వరల్డ్ ఎబిలిటీస్పోర్ట్స్ యూత్ గేమ్స్‌లో నా కల సాకారం చేసుకుంటానని తెలిపింది.

2024 వరల్డ్ ఎబిలిటీస్పోర్ట్స్ యూత్ గేమ్స్‌కు ఎంపిక..

డిసెంబర్ 1 నుంచి 7 వరకు థాయిలాండ్‌లో 2024 వరల్డ్ ఎబిలిటీస్పోర్ట్స్ యూత్ గేమ్స్‌ జరగనున్నాయి. ఈ గేమ్స్‌కు విజయ దీపిక ఎంపికైంది. అయితే, ఈ గేమ్స్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వం తరపునుంచి ఎటువంటి ఆర్థియ సహాయం లభించదు. ప్లేయర్స్ తమ స్వంత ఖర్చులతో ఈ గేమ్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందుకోసం బాగానే ఖర్చు అవుతుంది.

ఈ గేమ్స్‌లో పాల్గొనేందుకు ప్రవేశ రుసుముగా రూ. 17,215లు కట్టాల్సి ఉంది. అలాగే ప్లేయర్ల బోర్డింగ్, లాడ్జింగ్ కోసం రూ. 77,791లు చెల్లించాలి. విమాన ఛార్జీలు రూ. 58,694లు అవుతుండగా.. వీసా ఫీజు, బీమా, ట్రాక్ సూట్ కోసం మరో రూ. 14,000 లు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అన్ని రకాల ఫీజులు కలిపి మొత్తంగా రూ. 1,67,700లు తప్పనిసరిగా పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఖాతాకు అక్టోబర్ 15, 2024 లేదా అంతకు ముందు జమ చేయాల్సి ఉంటుంది. అయితే, విజయ దీపికకు సహాయంగా తల్లి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం మరింత డబ్బు అవసరం కానుంది. ఇప్పటికే పలు ప్రయత్నాలు కూడా విజయ దీపిక కుటుంబం ప్రయత్నిస్తోంది. ఎవరైనా దాతలు, ప్రభుత్వం, క్రీడాసంస్థలు, స్పాన్సర్లు ముందుకొస్తే థాయిలాండ్‌లో జరిగే 2024 వరల్డ్ ఎబిలిటీస్పోర్ట్స్ యూత్ గేమ్స్‌లో పాల్గొని పతకం సాధింస్తానని ధీమాగా చెబుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..