
జూబ్లీహిల్స్: కేవలం రెండేళ్లు 11 నెలల వయస్సులోనే చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్. చిన్న వయస్సులోనే రెండు ప్రపంచ రికార్డులు సాధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో చోటు సంపాదించాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రేయాన్ష్ అసాధారణ ప్రతిభ చూపించాడు. కేవలం 15 నిమిషాల 52 సెకండ్లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్మేట్స్ను పరిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా 1 గంట 9 నిమిషాల 9 సెకండ్లలో 21 చెస్ బోర్డులను అమర్చి మరో రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ కార్యక్రమం ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్లో ఘనంగా జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారి ప్రతిభను ప్రశంసించారు.
క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ… ఇంత చిన్న వయస్సులో ఇలాంటి ప్రతిభ అరుదని, శ్రేయాన్ష్ భవిష్యత్లో దేశానికి గర్వకారణమవుతాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ ఈ విజయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. మనవడి ప్రతిభను చూసి ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఈ విజయాన్ని ఎంతో గర్వంగా భావించారు.
శ్రేయాన్ష్ తల్లి కొండా సుస్మిత పటేల్ మాట్లాడుతూ… తన కుమారుడి అభిరుచులకు అనుగుణంగా పూర్తిస్థాయి సహకారం అందిస్తామని తెలిపారు. అతని ప్రతిభను మరింతగా మెరుగుపరచడమే తమ లక్ష్యమన్నారు.
రాయ్ చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… శ్రేయాన్ష్ సాధన కేవలం రికార్డుల కోసమే కాదని, భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. సరైన మార్గదర్శకత్వంతో పిల్లలలో ఉన్న అపార ప్రతిభ బయటపడుతుందని తెలిపారు.
ఇప్పటికే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) గుర్తింపు పొందిన శ్రేయాన్ష్… త్వరలో బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారం పొందనున్నాడు. ఈ చిన్నారి విజయంతో తెలంగాణ గర్వపడుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..