ముంబయి: ఆర్మీ టోపీలు ధరించే ముందు భారత జట్టు ఐసీసీ నుంచి అనుమతి తీసుకుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టం చేసింది. పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేసేందుకు ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఆర్మీ టోపీలు ధరించిన సంగతి తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు తమ మ్యాచ్ ఫీజు మొత్తాన్ని జాతీయ రక్షణ నిధికి ప్రకటించారు. దానికి గుర్తుగా ఆర్మీ టోపీలు ధరించారు. ఆర్మీ టోపీలు ధరించి ఆడటంపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘భారత ఆటగాళ్లు ఆర్మీ టోపీలు ధరించి క్రికెట్ ఆడటం ప్రపంచం మొత్తం చూసింది. దీనిపై ఐసీసీ చర్యలు తీసుకోదా.? దీనికి ఐసీసీ బాధ్యత వహించాల’ని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రి మహమ్మద్ ఖురేషీ ప్రశ్నించారు.
టోపీల వ్యవహారంపై పాకిస్థాన్కు చెందిన మరో మంత్రి కూడా స్పందించారు. భారత్ ఇటువంటి చర్యలు మానుకోకపోతే పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరిస్తారన్నారు. భారత్ కశ్మీర్లో చేస్తున్న దురాగతాలను ప్రపంచానికి చెప్తామని ఆయన ట్విటర్లో విమర్శించారు. అయితే దీనిపై ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్ మండలి) స్పష్టతనిచ్చింది. టోపీలు ధరించడానికి ముందు ఐసీసీ సీఈవో రిచర్డ్సన్ వద్ద బీసీసీఐ అనుమతులు తీసుకుందని ఐసీసీ తెలిపింది.