FIFA World Cup 2026 : టీమిండియా లేదనే బాధే లేదు.. ప్రపంచకప్‌లో విశ్వరూపం చూపించబోతున్న భారతీయులు

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో భారత్ లేకపోయినా భారతీయ అభిమానులకు గర్వకారణం దక్కింది. ఖతర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కాంగో జట్ల తరఫున నలుగురు భారత సంతతి ఫుట్‌బాలర్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో కేరళకు చెందిన తహ్సిన్ మహ్మద్ జంషీద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

FIFA World Cup 2026 : టీమిండియా లేదనే బాధే లేదు.. ప్రపంచకప్‌లో విశ్వరూపం చూపించబోతున్న భారతీయులు
Fifa World Cup 2026

Updated on: Jun 12, 2026 | 7:37 PM

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రపంచకప్‎లో మన దేశం ఎప్పుడు ఈ మెగా టోర్నీలో ఆడుతుందా అని కోట్ల మంది భారతీయ క్రీడాభిమానులు దశాబ్దాలుగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా టీమిండియా లైనప్‌లో లేకపోయినప్పటికీ, భారతీయ ఫ్యాన్స్ ఆనందించేలా ఒక అద్భుతమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు భారత సంతతికి చెందిన ఫుట్‌బాల్ ఆటగాళ్లు వేర్వేరు దేశాల జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ బరిలోకి దిగుతున్నారు. వారిలో ఒకరు పక్కా మలయాళీ కుర్రాడు కావడం విశేషం.

ఖతార్ జట్టులో కేరళ కుర్రాడు తస్మీన్ మహ్మద్ సంచలనం

ప్రపంచకప్‌లో ఖతర్ జట్టు తరఫున వింగర్‌గా ఆడుతున్న 19 ఏళ్ల యువ ఫుట్‌బాలర్ తహ్సిన్ మహ్మద్ జంషీద్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేరళలోని కన్నూర్ జిల్లా వలపట్టణం ప్రాంతానికి చెందిన తహ్సిన్, జంషీద్ తచ్చంకండి, వాసి షైమా దంపతుల కుమారుడు. తహ్సిన్ కుటుంబం 1996లో ఖతర్‌కు వలస వెళ్లింది. తహ్సిన్ తండ్రి జంషీద్ గతంలో కాలికట్ యూనివర్సిటీ తరఫున ఫుట్ బాల్ ఆడారు. తండ్రి అడుగుజాడల్లోనే నడిచిన తహ్సిన్ చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఖతర్‌లోని ప్రముఖ ఆస్పైర్ ఫుట్‌బాల్ అకాడమీలో శిక్షణ పొందిన తహ్సిన్ తన ప్రతిభతో వేగంగా ఎదిగాడు. ప్రస్తుతం అతను ఖతర్ స్టార్స్ లీగ్లోని అగ్రశ్రేణి క్లబ్ అల్ దుహైల్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పుడు ప్రపంచకప్ వేదికపై ఖతర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, భారతీయ మూలాలు కలిగిన ఈ యువ ఫుట్‌బాలర్ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతున్నాడు.

ఆస్ట్రేలియా టీమ్‌లో ఆంగ్లో-ఇండియన్ స్టార్ నిషాన్ వేలుపిళ్లై

ఈ మెగా టోర్నీలో మెరవబోతున్న మరో భారత సంతతి ఆటగాడు 25 ఏళ్ల నిషాన్ వేలుపిళ్లై. ఈయన ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కీలక సభ్యుడిగా ఎంపికయ్యాడు. నిషాన్ తల్లి గిలియన్ ఆంగ్లో-ఇండియన్ వంశానికి చెందిన మహిళ కాగా, తండ్రిది శ్రీలంక-మలేషియా నేపథ్యం. ప్రస్తుతం మెల్‌బోర్న్ విక్టరీ క్లబ్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న ఈ వింగర్.. 2024లో చైల్డ్‌తో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లోనే సూపర్ గోల్ కొట్టి ఆస్ట్రేలియా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

న్యూజిలాండ్ తరఫున పంజాబీ ముద్దుబిడ్డ సర్ ప్రీత్ సింగ్

న్యూజిలాండ్ ఆటగాడు సర్ ప్రీత్ సింగ్ ఒక పంజాబీ దంపతుల కుమారుడు. 27 ఏళ్ల ఇతను ఒక అటాకింగ్ మిడ్‌ఫీల్డర్. అతను గతంలో ముంబైలో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో భారత్‌పై న్యూజిలాండ్ తరపున ఆడాడు. అతను గతంలో బేయర్న్ మ్యూనిచ్ ఆటగాడు. ప్రస్తుతం అతను వెల్లింగ్టన్ ఫీనిక్స్ తరపున ఆడుతున్నాడు. అతనికి 2018లో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో న్యూజిలాండ్ తరపున ఆడే అవకాశం లభించింది. ఆ టోర్నమెంట్‌లోనే ఆ ఆటగాడు తన తొలి అంతర్జాతీయ గోల్‌ను సాధించాడు.

తమిళనాడు కనెక్షన్‌తో కాంగో తరఫున శ్యామ్యువల్ ముత్తుసామి

ఈ జాబితాలో నాల్గవ ఆటగాడు 29 ఏళ్ల శ్యామ్యువల్ ముత్తుసామి. ఈయన ఆఫ్రికన్ దేశమైన కాంగో జాతీయ జట్టుకు మిడ్‌ఫీల్డర్‌గా వ్యవహరిస్తున్నాడు. శ్యామ్యువల్ తండ్రి తమిళనాడుకు చెందిన భారతీయుడు కాగా, తల్లి కాంగో దేశస్థురాలు. ఫ్రాన్స్‌లో పుట్టి పెరిగిన శ్యామ్యువల్, ప్రస్తుతం ప్రసిద్ధ ఫ్రెంచ్ లీగ్‌లోని నాంటెస్ క్లబ్ తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. గతంలో 2006 ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ తరఫున వికాష్ దొరాసూ అనే భారత సంతతి ప్లేయర్ ఆడాడు. అయితే ఒకే వరల్డ్ కప్‌లో ఇంతమంది భారతీయ మూలాలున్న ఆటగాళ్లు ఆడటం ఇదే తొలిసారి. భారత్ ఆడకపోయినా, ఈ నలుగురు ఆటగాళ్ల ప్రదర్శన చూడటానికి దేశంలోని ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us