
Indian Cricket Team 2027 World Cup: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2027 వేదికలు ఖరారయ్యాయి. ఆఫ్రికా ఖండంలోని 12 మైదానాల్లో ఈ సమరం జరగనుంది. పేసర్లకు అనుకూలించే ఆఫ్రికా పిచ్లపై భారత్ సాధించే విజయాల్లో కింగ్ కోహ్లీ పాత్ర కీలకం కానుంది. గతంలో ఆ వేదికల్లో విరాట్ నమోదు చేసిన అద్భుతమైన గణాంకాలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.
సుదీర్ఘమైన 24 సంవత్సరాల విరామం తర్వాత ఆఫ్రికా ఖండం మళ్లీ వన్డే ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ అద్భుత టోర్నీని నిర్వహించనున్నాయి. 2027 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: WTC ఫైనల్ రేస్ నుంచి పాక్తోపాటు టీమిండియా ఔట్.. ఇలా జరిగితేనే గిల్ సేనకు ఛాన్స్..?
సవాలుతో కూడుకున్న ఆఫ్రికన్ పిచ్లపై టీమిండియా విజయం సాధించడం అంత తేలికైన విషయం కాదు. అక్కడి మైదానాలు బౌన్స్కు, వేగానికి ప్రసిద్ధి చెందాయి. అయితే కింగ్ కోహ్లీకి ఆ పిచ్లపై ఆడిన అనుభవం ఉండటం భారత్కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.
వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్న 12 స్టేడియాల్లో 8 మైదానాల్లో విరాట్ కోహ్లీకి ఆడిన అనుభవం ఉంది. మిగిలిన 4 మైదానాల్లో అతను ఇప్పటివరకు కాలు మోపలేదు. ఆఫ్రికా వేదికల్లో కోహ్లీ ఇప్పటివరకు 25 ఇన్నింగ్స్లు ఆడాడు.
ఆ ఇన్నింగ్స్లలో ఏకంగా 71.47 సగటుతో 1358 పరుగులు బాదాడు. ఇందులో 4 అద్భుతమైన శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఐదు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఈ గణాంకాలే ఆఫ్రికా గడ్డపై కోహ్లీకి ఉన్న తిరుగులేని ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.
టోర్నీ జరగనున్న కేప్టౌన్లోని న్యూలాండ్స్ స్టేడియంలో కోహ్లీ అత్యుత్తమంగా నాటౌట్గా 160 పరుగులు చేశాడు. సెంచూరియన్లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్లో నాటౌట్గా 129 పరుగులు, డర్బన్లో 112 పరుగులు, హరారే మైదానంలో 115 పరుగులతో శతకాలు బాదాడు.
గెబర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్లో 87 పరుగులు, జోహన్నెస్బర్గ్లోని వాండరర్స్ మైదానంలో 75 పరుగులు, పార్ల్ వేదికగా 51 పరుగులు సాధించాడు. బులావాయోలో సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. బఫెలో పార్క్, బ్లూమ్ఫోంటెన్, విక్టోరియా ఫాల్స్, విండ్హోక్ (నమీబియా) మైదానాల్లో కోహ్లీకి ఇంకా ఆడే అవకాశం దక్కలేదు.
కేప్టౌన్, జోహన్నెస్బర్గ్, సెంచూరియన్, గెబర్హా, బ్లూమ్ఫోంటెన్, పార్ల్, ఈస్ట్ లండన్ బఫెలో పార్క్లలో మ్యాచ్లు జరగనున్నాయి. జింబాబ్వేలోని బులావాయో, హరారే, విక్టోరియా ఫాల్స్ మైదానాలతో పాటు నమీబియా క్రికెట్ గ్రౌండ్ ఈ ప్రపంచకప్కు వేదికలుగా మారనున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..